డాక్టర్లు రాజకీయాల్లోకి వద్దన్నారు
ABN , First Publish Date - 2020-10-30T08:14:21+05:30 IST
తన రాజకీయ అరంగేట్రంపై తలెత్తుతున్న అనుమానాలకు తమిళ అగ్ర కథానాయకుడు రజనీకాంత్ తెర దించారు. సరైన సమయంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అభిమాన సంఘాలతో చర్చించి రాజకీయ రంగ ప్రవేశం చేయడం ఖాయమని స్పష్టం చేశారు...
- కిడ్నీ మార్పిడి చేయించుకొన్నప్పుడు ఈ సలహా ఇచ్చారు
- సరైన సమయంలో రావడం ఖాయం: రజనీ
చెన్నై, అక్టోబరు 29 : తన రాజకీయ అరంగేట్రంపై తలెత్తుతున్న అనుమానాలకు తమిళ అగ్ర కథానాయకుడు రజనీకాంత్ తెర దించారు. సరైన సమయంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అభిమాన సంఘాలతో చర్చించి రాజకీయ రంగ ప్రవేశం చేయడం ఖాయమని స్పష్టం చేశారు. రాజకీయాల్లోకి రావడంపై ఆరోగ్య కారణాల రీత్యా రజనీ పునరాలోచనలో పడ్డారంటూ సోషల్ మీడియాలో కథనాలు వైరల్ అవుతున్నాయి. ఇది అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ వ్యవహారంపై ఎట్టకేలకు గురువారం రజనీకాంత్ స్పందించారు. ఆ ప్రకటనతో తనకు సంబంధం లేదంటూనే, అందులోని ఆరోగ్యసంబంధ అంశాలు వాస్తవమేనన్నారు.‘‘నాకు 2016లో కిడ్నీ మార్పిడి ఆపరేషన్ జరిగింది. ఆ ఆపరేషన్ చేసిన వైద్యులు.. ఆరోగ్య కారణాల రీత్యా రాజకీయాలకు దూరంగా ఉండాలని అప్పట్లో నాకు సలహా ఇచ్చారు’’ అని రజనీ తెలిపారు. అయితే, అది వారి సలహా మాత్రమేనని, రాజకీయాల్లో రావాలనే నిర్ణయం నుంచి తాను వెనక్కి పోయేది లేదన్నారు.