Virat Kohli: ధోనీ ఒక్కడే.. అండగా నిలిచాడు
ABN, First Publish Date - 2023-02-26T02:22:48+05:30
మహేంద్ర సింగ్ ధోనీ.. విరాట్ కోహ్లీ. భారత క్రికెట్ జట్టుకు అత్యంత విజయవంతమైన కెప్టెన్లుగా పేరు తెచ్చుకోగలిగారు. అంతేకాకుండా వీరిద్దరి అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఎప్పటికీ నా సారథి అతడే
నన్నో ఫెయిల్యూర్ కెప్టెన్గా భావించారు
విరాట్ కోహ్లీ
న్యూఢిల్లీ: మహేంద్ర సింగ్ ధోనీ.. విరాట్ కోహ్లీ. భారత క్రికెట్ జట్టుకు అత్యంత విజయవంతమైన కెప్టెన్లుగా పేరు తెచ్చుకోగలిగారు. అంతేకాకుండా వీరిద్దరి అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టీమిండియాకు తిరుగులేని నాయకుడిగా కొనసాగుతున్న సమయంలోనే హఠాత్తుగా ధోనీ టెస్టు జట్టు పగ్గాలను కోహ్లీకి అప్పగించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత పరిమిత ఓవర్లలోనూ తనే నాయకుడయ్యాడు. ఈ సమయంలో ఓ ఆటగాడిగానూ ధోనీ అతడికి వెన్నంటే ఉండి కీలక సలహాలిచ్చేవాడు. 2008 నుంచి 2019 వరకు డ్రెస్సింగ్ రూమ్ పంచుకున్న ఎంఎస్.. క్లిష్ట సమయాల్లోనూ తనకు మద్దతుగా నిలిచాడని విరాట్ తెలిపాడు. తాజాగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పాడ్కాస్ట్ రెండో సీజన్కు కోహ్లీ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ సందర్భంగా అతను చెప్పిన పలు విషయాలు..
అతడొక్కడే
మూడేళ్లపాటు నా కెరీర్ చాలా ఒడిదొడుకులతో కొనసాగింది. ఈ ఇబ్బందికర పరిస్థితిలో అనుష్క నా వెన్నంటే ఉంది. ఆమే నా బలం. ఇక చిన్ననాటి కోచ్, కుటుంబం కాకుండా ఆ సమయంలో బయటి నుంచి అండగా నిలిచింది ధోనీ మాత్రమే. వాస్తవానికి ధోనీని ఫోన్లో పట్టుకోవడం కష్టం. ఎప్పుడైనా నేను ఫోన్ చేసినా కూడా 99 శాతం ఫోన్ ఎత్తడు. ఎందుకంటే అసలతను ఫోన్ను పట్టించుకోడు. అలాంటిది ధోనీయే నాకు రెండుసార్లు మెసేజ్ చేశాడు. ఫామ్ కోల్పోయి విమర్శలు ఎదుర్కొంటున్న సమయంలో ‘నీవు బలమైన వ్యక్తిగా కనిపించినప్పుడు.. ఇతరులు నువ్వెలా ఉన్నావన్న విషయాన్ని అడగడం మర్చిపోతారు’ అని తను పంపిన సందేశం నా మనస్సులో బలంగా నాటుకుపోయింది. ఎందుకంటే నేను కూడా ఎప్పుడూ ఆత్మవిశ్వాసంతో పాటు మానసికంగా కూడా బలంగా ఉండాలనుకుంటాను.
మహీకి కుడిభుజం
మహీ సారథ్యంలో నేను వైస్ కెప్టెన్గా ఉండేవాణ్ణి. కెప్టెన్సీ గురిం చి నాకెన్నో విషయాలు చెబుతుండేవాడు. నేనెప్పుడూ అతని కుడిభుజంలాంటి వాడినే. మ్యాచ్ ఉత్కంఠగా ఉన్న పరిస్థితుల్లో ఫీల్డ్ లో తరచూ అతనితో చర్చించేవాణ్ణి. 2012 నుంచే ధోనీ నాపై తీవ్రంగా ప్రభావం చూపాడు. అందుకే నా కెప్టెన్ ఎప్పటికీ అతడే.
విఫల నాయకుడిగా ముద్ర
2017 చాంపియన్స్ ట్రోఫీ, 2019 వన్డే వరల్డ్కప్, 2021లో వరల్డ్ టెస్టు చాంపియన్షి్ప ఫైనల్, అదే ఏడాది టీ20 వరల్డ్క్పలోనూ సారథ్యం వహించినా నా కెప్టెన్సీలో టీమిండియా ఐసీసీ ట్రోఫీ గెలవలేకపోయింది. దీంతో విమర్శకుల దృష్టిలో నేనో ఫెయిల్యూర్ కెప్టెన్ని. కానీ ఓ జట్టుగా మేం సాధించిన పురోగతికి, మా ఆటతీరులో వచ్చిన మార్పులకు నేను గర్విస్తాను. అలాగే ఓ ఆటగాడిగా నేను చాంపియన్స్ ట్రోఫీ, వరల్డ్కప్ విజయాల్లో భాగస్వామిని అయ్యాను. అసలు ప్రపంచక్పను ఎన్నడూ గెలవని ఆటగాళ్లు కూడా ఉన్నారనే విషయం మరవద్దు.
35 వేల మంది ఎగతాళి చేశారు
2014 ఇంగ్లండ్ పర్యటన నాకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. నాలుగేళ్ల తర్వాత తిరిగి 2018లో ఆ దేశ పర్యటనకు వెళ్లాం. ఎడ్జ్బాస్టన్ టెస్టు ఆడేందుకు క్రీజులోకి వచ్చే సమయంలో స్టేడియంలోని 35 వేల మంది ప్రేక్షకులు నన్ను ఎగతాళి చేస్తూ కనిపించారు. ఆ సమయంలో నా గుండె వేగంగా కొట్టుకుంది. ఆ ఇన్నింగ్స్లో 22 పరుగుల వద్ద అవుటవ్వాల్సిన నేను 149 పరుగులు చేయడంతో ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు.
Updated Date - 2023-02-26T02:22:49+05:30 IST