ముంబైలో కంట్రోల్‌ ఎస్‌కు 10 డేటా సెంటర్లు

ABN , First Publish Date - 2022-01-13T07:50:35+05:30 IST

హైదరాబాద్‌కు చెందిన కంట్రోల్‌ ఎస్‌ ముంబైలో దేశంలోనే అతిపెద్ద గ్యాస్‌ ఇన్సులేటెడ్‌ సబ్‌స్టేషన్‌ (జీఐఎస్‌) ఏర్పాటు చేస్తోంది. నవీ ముంబై లో ఏర్పాటు చేస్తున్న 10..

ముంబైలో కంట్రోల్‌ ఎస్‌కు 10 డేటా సెంటర్లు

  • ఆసియాలోనే అతిపెద్ద జీఐఎస్‌ ఏర్పాటు


హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): హైదరాబాద్‌కు చెందిన  కంట్రోల్‌ ఎస్‌ ముంబైలో దేశంలోనే అతిపెద్ద గ్యాస్‌ ఇన్సులేటెడ్‌ సబ్‌స్టేషన్‌ (జీఐఎస్‌) ఏర్పాటు చేస్తోంది. నవీ ముంబై లో ఏర్పాటు చేస్తున్న 10 డేటా సెంటర్ల క్లస్టర్‌కు ఇది నిరం తరాయంగా విద్యుత్‌ను అందిస్తుంది. 300 మెగా వాట్ల సామర్థ్యంతో దీన్ని ఏర్పాటు చేస్తున్నామని సామర్థ్యాన్ని 700 మెగావాట్ల వరకూ పెంచుకోవచ్చని కంట్రోల్‌ ఎస్‌ డేటా సెంటర్స్‌  వ్యవస్థాపకుడు, సీఈఓ శ్రీధర్‌ పిన్నపురెడ్డి తెలిపారు. 20 లక్షల చదరపు  అడుగుల విస్తీర్ణంలో  ఏర్పాటు చేస్తున్న ఈ క్లస్టర్‌లో నాలుగు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయని వివరించారు.  దేశీయ డేటా సెంటర్‌ పరిశ్రమలో తమ జీఐఎస్‌ కొత్త మలుపు కాగలదని శ్రీధర్‌ అన్నారు. 


రూ.750 కోట్ల పెట్టుడులు..

దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో డేటా కేంద్రాలను ఏర్పాటు చేయడానికి కంట్రోల్‌ ఎస్‌ 10 కోట్ల డాలర్ల (దాదాపు రూ.750 కోట్లు) పెట్టుబడులు పెట్టనుంది. ప్రస్తుతం హైదరాబాద్‌, బెంగళూరు, నోయిడా, ముంబైల్లో డేటా కేంద్రాలున్నాయని.. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలకు కూడా డేటా సెంటర్‌ నెట్‌వర్క్‌ను విస్తరించనున్నామని శ్రీధర్‌ తెలిపారు. వచ్చే రెండేళ్ల కాలంలో 60 లక్షల చదరపు అడుగుల్లో విస్తరించి ఉన్న డేటా కేంద్రాల సామర్థ్యాన్ని కలిగి ఉంటామని చెప్పారు. ప్రస్తుతం దేశంలో 650 మెగావాట్ల సామర్థ్యం కలిగిన డేటా సెంటర్లు ఉన్నాయని.. పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా విద్యుత్‌ సామర్థ్యాన్ని రెట్టింపు చేయనున్నామని తెలిపారు. 


Updated Date - 2022-01-13T07:50:35+05:30 IST