మసీదులో పేలుడు.. 100 మంది మృతి
ABN , First Publish Date - 2021-10-09T00:14:06+05:30 IST
ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్లో ఉగ్రమూకలు మరోమారు చెలరేగిపోయాయి. షియా ముస్లింలను లక్ష్యంగా చేసుకుని కుందుజ్
కాబూల్: ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్లో ఉగ్రమూకలు మరోమారు చెలరేగిపోయాయి. షియా ముస్లింలను లక్ష్యంగా చేసుకుని కుందుజ్ నగరంలోని మసీదుపై ఈ రోజు (శుక్రవారం) మధ్యాహ్నం జరిపిన బాంబు దాడిలో దాదాపు 100 మంది ప్రాణాలు కోల్పోగా, మరెంతో మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ మేరకు తాలిబన్ పోలీసు అధికారి వెల్లడించారు.
కుందుజ్ ప్రావిన్స్లోని బందర్ జిల్లా ఖాన్ అదాబ్లోని షియా మసీదులో ఈ పేలుడు సంభవించిందని, ఈ ఘటనలో పలువురు మరణించగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారని తాలిబన్ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ తెలిపారు. పేలుడు దాటికి మృతదేహాలు చెల్లాచెదురుగా ఎగిరిపడ్డాయి. మసీదు మొత్తం రక్తంతో నిండిపోయింది. శరీరాలు రక్తపు ముద్దలుగా మారాయి. బాధితుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతంలో తీరని విషాదం నిండుకుంది. మృతుల్లో పలువురు మహిళలు, చిన్నారులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ హృదయ విదారక ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇదిలావుండగా, ఆఫ్ఘనిస్థాన్ రాజధాని నగరం కాబూల్లో సిక్కు మైనారిటీల గురుద్వారాపై మంగళవారం తాలిబన్ ఉగ్రవాదులు దాడి చేశారు. సీసీటీవీ కెమెరాలను, ఇతర వస్తువులు, పరికరాలను ధ్వంసం చేశారు. ఇండియన్ వరల్డ్ ఫోరం అధ్యక్షుడు పునీత్ సింగ్ చందోక్ ఇచ్చిన ట్వీట్లో ఈ వివరాలను తెలిపారు.