పెద్దమనసు చాటిన దుబాయ్ పోలీసులు.. సొంత ఖర్చులతో..
ABN , First Publish Date - 2020-08-05T18:09:29+05:30 IST
గల్ఫ్ దేశమైన దుబాయ్ పోలీసులు పెద్దమనసు చాటారు.
దుబాయ్: గల్ఫ్ దేశమైన దుబాయ్ పోలీసులు పెద్దమనసు చాటారు. వివిధ నేరాల్లో జైలుకెళ్లి... శిక్షకాలం పూర్తి చేసుకుని స్వదేశాలకు వెళ్లలేని స్థితిలో ఉన్న సుమారు 1,145 మంది ఖైదీలకు దుబాయ్ పోలీసులు తమ సొంత ఖర్చులతో విమాన టికెట్లు ఏర్పాటు చేశారు. దీనికోసం పోలీసులు ఏకంగా 1.47 మిలియన్ దిర్హామ్స్ ఖర్చు చేశారు. పలువురు దాతల సహకారంతో ఈ భారీ మొత్తాన్ని సమకూర్చినట్లు శిక్షా, దిద్దుబాటు సంస్థల జనరల్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ బ్రిగేడియర్ అలీ అల్ షమాలి పేర్కొన్నారు. శిక్షకాలం పూర్తి చేసుకున్న ఖైదీలు స్వదేశాలకు వెళ్లి వారి కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతో ఇలా దాతల నుంచి విరాళాలు సేకరించి మరీ వారిని పంపించడం జరిగిందని తెలిపారు. మానవత దృక్పథంతో ప్రతి ఏటా స్వచ్చంధ సంస్థల సహకారంతో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు అలీ అల్ షమాలి చెప్పారు. కాగా, స్వదేశాలకు తరలివెళ్లిన 1,145 ఖైదీలలో పురుషులతో పాటు మహిళలు కూడా ఉన్నారు.