115 అడుగుల ఎత్తైన జాతీయ జెండా ఆవిష్కరించిన కేజ్రీవాల్
ABN , First Publish Date - 2021-08-15T21:17:04+05:30 IST
దేశ 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా 115 అడుగుల ఎత్తైన జాతీయ పతాకాన్ని..
న్యూఢిల్లీ: దేశ 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా 115 అడుగుల ఎత్తైన జాతీయ పతాకాన్ని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదివారంనాడు ఎగురవేశారు. తన సొంత నియోజకవర్గంలో (న్యూఢిల్లీ నియోజకవర్గం) ఆయన ఈ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జెండా ఎగురవేస్తున్నప్పుడు ''అన్న ఆందోళన'' రోజులు, అన్నాజీ (హజారే) భారత్ మాతా కీ జై అని ఏ విధంగా చెప్పేవారో జ్ఞాపకం వచ్చాయని అన్నారు. 115 అడుగుల ఎత్తైన జాతీయ పతాకాలను దేశ రాజధాని నగరంలో 500 వరకూ ఏర్పాటు చేయాలని నిర్ణయించామని, రిపబ్లిక్ డే వరకూ వీటిని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రజల్లో దేశ భక్తి భావాలను పెంపొందించే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమం చేపడుతున్నట్టు తెలిపారు.
కాగా, ప్రభుత్వ సెక్రటేరియట్లో జరిగిన ఇండిపెండెన్స్ డే ప్రసంగంలో కేజ్రీవాల్ మాట్లాడుతూ, భగత్ సింగ్ స్మృత్యర్థం సెప్టెంబర్ 27 నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో 'దేశభక్తి' పాఠ్యాంశాలు చేరుస్తామని, అక్టోబర్ 2 నుంచి రెసిడెన్షియల్ ఏరియాల్లో యోగా తరుగతులు నిర్వహిస్తామని చెప్పారు. వినూత్న ఆలోచనతో 'మోడల్ ఆఫ్ గవర్నెన్స్'గా ఢిల్లీ నిలుస్తోందని అన్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన స్వాతంత్ర్య సమరయోధులు, కరోనా మహమ్మారి సమయంలో ప్రజలకు సేవలందిస్తూ ప్రాణాలు కోల్పోయిన వైద్యులు, నర్సులకు కేజ్రీవాల్ నివాళులు అర్పించారు.