బీజేపీలో 12 మంది ఎమ్మెల్యేల చేరిక అవాస్తవం: ఎన్సీపీ
ABN , First Publish Date - 2020-08-10T20:34:11+05:30 IST
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)కి చెందిన 12 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరినట్టు వస్తున్న వార్తలను మహారాష్ట్ర కేబినెట్ మంత్రి..
న్యూఢిల్లీ: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)కి చెందిన 12 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరినట్టు వస్తున్న వార్తలను మహారాష్ట్ర కేబినెట్ మంత్రి, ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ సోమవారంనాడు ఖండించారు. కొందరు ఇలాంటి నిరాధార వార్తలను ప్రచారం చేస్తున్నారని వివరణ ఇచ్చారు. నిజానికి, 2019కి ముందు బీజేపీలోకి వెళ్లిన పలువురు ఎమ్మెల్యేలు తిరిగి ఎన్సీపీలోకి వచ్చేందుకు ఆసక్తితో ఉన్నారని ఆయన చెప్పారు.
'12 మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరినట్టు వస్తున్న వార్తలన్నీ కట్టుకథలే. పూర్తిగా నిరాధారం. నిజానికి 2019 ముందు బీజేపీలోకి వెళ్లిన వాళ్లే తిరిగి ఎన్సీపీలోకి వస్తామంటున్నారు. దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. త్వరలోనే పార్టీ నిర్ణయాన్ని బహిరంగంగా ప్రకటిస్తాం' అని మాలిక్ ఓ ట్వీట్లో తెలిపారు.
కాగా, 288 మంది సభ్యుల మహారాష్ట్ర అసెంబ్లీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ 105 సీట్లతో ఏకైక పెద్దపార్టీగా నిలిచింది. శివసేన 56 సీట్లు గెలుచుకుని రెండో స్థానంలో ఉంది. ఎన్సీపీ 54 సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్ 44 సీట్లు కైవసం చేసుకుంది. బీజేపీ-శివసేన కూటమి సంపూర్ణ మెజారిటీ సాధించినప్పటికీ ముఖ్యమంత్రి పదవి విషయంలో పట్టుదలకు పోవడంతో ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయింది. దీంతో ఉద్ధవ్ థాకరే నాయకత్వంలోని శివసేన అటు ఎన్సీపీని, ఇటు కాంగ్రెస్ను కలుపుకొని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.