ఈ ఏడాది 12% వృద్ధి

ABN , First Publish Date - 2021-03-20T06:29:37+05:30 IST

గత ఏడాదిలో -7.1 శాతానికి క్షీణించిన భారత జీడీపీ.. 2021లో 12 శాతం వృద్ధిని నమోదు చేసుకోవచ్చని మూడీస్‌ అనలిటిక్స్‌ తాజా నివేదిక అంచనా వేసింది. గత ఏడాది వరుసగా రెండు త్రైమాసికాల (ఏప్రిల్‌-సెప్టెంబరు) పాటు జీడీపీ భారీ

ఈ ఏడాది 12% వృద్ధి

మూడీస్‌ అనలిటిక్స్‌ అంచనా 


న్యూఢిల్లీ: గత ఏడాదిలో -7.1 శాతానికి క్షీణించిన భారత జీడీపీ.. 2021లో 12 శాతం వృద్ధిని నమోదు చేసుకోవచ్చని మూడీస్‌ అనలిటిక్స్‌ తాజా నివేదిక అంచనా వేసింది. గత ఏడాది వరుసగా రెండు త్రైమాసికాల (ఏప్రిల్‌-సెప్టెంబరు) పాటు జీడీపీ భారీ క్షీణతను నమోదు చేసుకుంది. ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో -23.9 శాతానికి పతనమైంది. జూలై-సెప్టెంబరు కాలానికి వృద్ధి క్షీణత -7.5 శాతానికి పరిమితం కాగా, అక్టోబరు-డిసెంబరు త్రైమాసికంలో 0.4 శాతం వృద్ధిని నమోదు చేసుకోగలిగింది. దీంతో భారత్‌కు సమీప భవిష్యత్‌ వృద్ధి అవకాశాలు మరింత సానుకూలంగా మారాయని మూడీస్‌ నివేదిక పేర్కొంది. మరిన్ని విషయాలు.. 

  • లాక్‌డౌన్‌ ఆంక్షలను సడలించినప్పటి నుంచి దేశీయ, అంతర్జాతీయ గిరాకీ క్రమంగా మెరుగుపడుతూ వస్తోంది. దాంతో, గడిచిన కొన్ని నెలల్లో మాన్యుఫాక్చరింగ్‌ రంగ ఉత్పత్తి గణనీయంగా పుంజుకుంది. 
  • వచ్చే కొన్ని త్రైమాసికాల్లో ప్రైవేట్‌ వినియోగం, ప్రవాస పెట్టుబడులు పుంజుకునే అవకాశం ఉంది. దాంతో ఈ ఏడాది దేశీయ వినియోగ గిరాకీ మరింత బలపడనుంది. 
  • ద్రవ్య, ఆర్థిక విధానాలు ఊతంగా వృద్ధి సానుకూలంగా కొనసాగవచ్చు. ఈ ఏడాది ఆర్‌బీఐ కీలక వడ్డీ (రెపో) రేటు తగ్గింపు ఉండకపోవచ్చు. ప్రస్తుతం రెపో 4 శాతంగా ఉంది. 
  • వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2021-22) వార్షిక ద్రవ్యలోటు జీడీపీలో దాదాపు 7 శాతానికి పరిమితం అయ్యే అవకాశం ఉంది.
  • ఆహార, ఇంధన ప్రభావిత ధరాఘాతం పెరిగినప్పటికీ ఈ ఏడాది కీలక ద్రవ్యోల్బణం చాలా వరకు అదుపులోకి రావచ్చు. 
  • ఈ ఏడాది జీడీపీ వృద్ధి పునరుద్ధరణకు కరోనా సెకండ్‌ వేవ్‌ ప్రధాన ముప్పుగా మారింది. మలివిడత కేసుల పెరుగుదల కొన్ని రాష్ట్రాలకే పరిమితం కావడం కొంత ఊరటనిచ్చే అంశం.  కాబట్టి, ఈసారి వైరస్‌ వ్యాప్తిని ప్రాథమిక దశలోనే కట్టడి చేసేందుకు అవకాశాలు పెరిగాయి. 

కరోనా సంక్షోభ ప్రభావాలను అధిగమించాలంటే, వచ్చే ఆర్థిక సంవత్సరం(2021-22)లో భారత్‌ 10.5-11 శాతం జీడీపీ వృద్ధి సాధించడంతోపాటు అదే స్థాయి వృద్ధిని కొనసాగించాల్సిన అవసరం ఉంది. కొవిడ్‌ వ్యాప్తి సమయంలో భారత్‌ సిద్ధంగా లేదు. తదుపరి మహమ్మారినైనా  సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు దేశం సంసిద్ధం కావాలి.  

- రాజీవ్‌ కుమార్‌, నీతి ఆయోగ్‌ ఉపాధ్యక్షుడు 

Updated Date - 2021-03-20T06:29:37+05:30 IST