అందోలు-జోగిపేట ప్రధాన రోడ్డుకు రూ.12.7 కోట్లు
ABN , First Publish Date - 2021-01-21T06:23:15+05:30 IST
అందోలు-జోగిపేట మున్సిపల్ పరిధిలోని ప్రధాన రోడ్డు (జాతీయ రహదారి)కు మహర్దశ పట్టనున్నదని అందోలు ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ తెలిపారు.
ఎన్హెచ్ఏఐ నిధులు మంజూరు: ఎమ్మెల్యే క్రాంతి కిరణ్
జోగిపేట, జనవరి 20: అందోలు-జోగిపేట మున్సిపల్ పరిధిలోని ప్రధాన రోడ్డు (జాతీయ రహదారి)కు మహర్దశ పట్టనున్నదని అందోలు ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మున్సిపల్ పరిధిలో ఉన్న ఈ రోడ్డు నిర్మాణానికి మంత్రి హరీశ్రావు చొరవ, ఎంపీ బీబీపాటిల్ సహకారంతో రూ.12.70 కోట్ల ఎన్హెచ్ఏఐ నిధులు మంజూరయ్యాయని ఆయన పేర్కొన్నారు. ఈ నిధులతో అందోలు నుంచి జోగిపేట వరకు గల జాతీయ రహదారికి ఇరువైపులా సైడ్ డ్రైన్ నిర్మాణంతోపాటు శిథిలమైన జాతీయ రహదారిని నూతనంగా నిర్మించనున్నట్టు వివరించారు. సంగారెడ్డి నుంచి జోగిపేట మీదుగా నాందేడ్ వరకు ఉన్న జాతీయ రహదారిని నాల్గు లేన్లుగా మార్చడంతో పాటు అందోలు-జోగిపేట పట్టణాలకు దూరంగా బైపాస్ రోడ్డును నిర్మిస్తున్నట్టు ఎమ్మెల్యే చెప్పారు. భారీ వర్షాలకు మున్సిపల్ పరిధిలోని జాతీయ రహదారి పూర్తిగా ధ్వంసమైన విషయాన్ని తాను మంత్రి హరీశ్రావు దృష్టికి తీసుకువెళ్లగా ఆయన రూ.20 కోట్లతో ప్రతిపాదనలు తయారు చేసి ఎన్హెచ్ఏఐకి పంపినట్టు తెలిపారు. మంత్రి, ఎంపీ చొరవతో నిధులు విడుదల చేస్తూ ఏఎన్హెచ్ఏఐచైర్మన్ సుఖ్బీర్సింగ్ ఉత్తర్వులు జారీ చేశారన్నారు. త్వరలోనే నిర్మాణం పనులు ప్రారంభమవుతాయని ఎమ్మెల్యే క్రాంతికిరణ్ తెలిపారు.