బొగ్గు కొరతతో మహారాష్ట్రలో 13 power plants మూత
ABN , First Publish Date - 2021-10-11T22:25:56+05:30 IST
దేశంలో బొగ్గు కొరత వివిధ పవర్ ప్లాంట్లపై ప్రభావం చూపుతోంది. మహారాష్ట్రలో బొగ్గు కొరతతో 13 థర్మల్ ప్లాంట్లు తాత్కాలికంగా ...
న్యూఢిల్లీ: దేశంలో బొగ్గు కొరత వివిధ పవర్ ప్లాంట్లపై ప్రభావం చూపుతోంది. మహారాష్ట్రలో బొగ్గు కొరతతో 13 థర్మల్ ప్లాంట్లు తాత్కాలికంగా మూతపడ్డాయి. దీంతో మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యురేటరీ కమిషన్ (ఎంఎస్ఈడీసీఎల్) అప్రమత్తమైంది. వినియోగదారులు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకూ, రాత్రి 6 గంటల నుంచి 10 గంటల వరకూ విద్యుత్ను ఆచితూచి వాడుకోవాలని కోరింది. వినియోగదారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఒక్కో యూనిట్ రూ.20 చొప్పున హెచ్చుధరకు కొనుగోలు చేస్తున్నట్టు ఎంఎస్ఈడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డెరెక్టర్ విజయ్ సింఘాల్ తెలిపారు. బొగ్గు సరఫరా మెరుగుపడేంత వరకూ మరో పది రోజులు వరకూ ఈ పరిస్థితి ఉండొచ్చని చెప్పారు.
ప్రస్తుతం బొగ్గు కొరత ప్రభావం 3,300 మెగావాట్ల విద్యుత్తు సరఫరాపై ఉందని, హైడ్రో పవర్, ఇతర మార్గాల ద్వారా ఈ లోటును భర్తీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని సింఘాల్ తెలిపారు. విద్యుత్కు డిమాండ్ పెరగడంతో బహిరంగ మార్కెట్లో విద్యుత్ కొనుగోలు ధరలకు కూడా రెక్కలొచ్చాయని, ఒక్కో యూనిట్ రూ.13.60 చొప్పున 700 మెగావాట్ల విద్యుత్ను బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేశామని చెప్పారు. కాగా, రాష్ట్రంలో పెరుగుతున్న ఉష్ట్రోగ్రత కారణంగా విద్యుత్ డిమాండ్ పెరగడంతో ఎంఎస్ఈడీసీఎల్ శనివారంనాడు మహారాష్ట్రకు (ముంబై మినహా) 17,289 మెగావాట్ల విద్యుత్ సరఫరా చేసింది. లోడ్ షెడ్డింగ్ ముప్పును దృష్టిలో ఉంచుకుని వ్యవసాయ కనెక్షన్లకు 8 గంటల పాటు త్రీఫేజ్ ఎలక్ట్రిసిటీని సరఫరా చేస్తోంది.