జిల్లాలో 133కు..పెరిగిన కేసులు
ABN , First Publish Date - 2020-06-01T09:51:09+05:30 IST
ఏలూరులో కరోనా వైరస్ వ్యాప్తి అంతకంతకూ పెరుగుతోంది. ఆదివారం ఆరు పాజిటివ్ కేసులు
ఏలూరులో మరో ఆరు
తోటగూడెం ఒకటి, నిడదవోలులో మరొకటి
ప్రభుత్వ ఉద్యోగికి పాజిటివ్
పెరుగుతున్న బాధితులు.. ఆందోళనలో జనం
ఏలూరు, మే 31(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఏలూరులో కరోనా వైరస్ వ్యాప్తి అంతకంతకూ పెరుగుతోంది. ఆదివారం ఆరు పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. ఒక్క నగరంలోనే 34 పాజిటివ్ కేసులు నమోదు కాగా, జిల్లా మొత్తం మీద కలిపి 133 కేసులున్నాయి. తాజాగా నిర్ధారణ అయిన కేసుల్లో ప్రభుత్వ ఉద్యోగి ఒకరు ఉన్నారు. వైద్యం పొందుతూ అనుమానాస్పద స్థితిలో శనివారం మరణించిన వ్యక్తి సోదరికి పాజిటివ్ నిర్ధారణ కావడం మరింత భయాందోళన సృష్టించింది. ఏలూరులోని అగ్రహారంలో రెండు, తూర్పు వీధిలో రెండు, మెయిన్ బజార్లో ఇంకొక పాజిటివ్ కేసు వెలుగు చూశాయి. పెదపాడు మండలం తోటగూడెం, నిడదవోలు ఒకొక్క కేసు బయటపడ్డాయి. జిల్లావ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఏ రోజుకారోజు పాత ప్రాంతాలతో సహా కొత్తగా మరిన్ని ప్రాంతాల్లోనూ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటి వరకు దాదాపు 35 వేల మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. మరో మూడు వేల మూడు వందల మంది నుంచి సేకరించిన నమూనాలకు నిర్ధారణ ఫలితాలు వెలువడాల్సి ఉంది. చికిత్స అనంతరం కోలుకోవడంతో 57 మందిని వారి స్వగృహాలకు తరలించారు. మరో 76 మందికి చికిత్సలు కొనసాగిస్తున్నారు. ఒక్క నిడదవోలు మినహా మిగతా అన్నిచోట్ల తాజాగా నిర్ధారణ అయిన పాజిటివ్ కేసులకు సంబంధించి కొత్త కంటైన్మెంట్లు ఆరంభించనున్నారు.
ఏలూరు రూరల్ : ఏలూరులో ఆరు కేసులు నమోదు కావడంతో కలకలం రేగుతోంది. అధికారులు అప్రమత్తమై బాధితుల నివాస ప్రాంతాల్లో ప్రత్యేక పారి శుధ్య చర్యలకు ఉపక్రమించారు. కేసు నిర్ధారణ జరిగిన ప్రాంతానికి మూడు కిలో మీటర్ల పరిధిలో సోడియం హైపోక్లోరైడ్, బ్లీచింగ్ ద్రావణాన్ని పిచికారీ చేయిస్తు న్నారు. రూరల్లోని వెంకటాపురంలో పాజిటివ్ నమోదుతో ప్రభుత్వ యంత్రాంగం తోపాటు ప్రజలు ఉలికిపాటుకు గురయ్యారు. బాధితుడిని కొవిడ్ ఆసుపత్రికి తర లించినప్పటికీ బాధితుడితో సన్నిహితంగా మెలిగిన స్థానికులు వణికిపోతున్నారు. వైద్యాధికారులు ధ్రువీకరించనప్పటికీ ఆ ప్రాంతానికి మూడు కిలోమీటర్ల పరిధిలో ప్రత్యేక పారిశుధ్య పనులు చేపట్టారు. కేసు నిర్ధారణ జరిగిన ప్రాంతాలను రెడ్ జోన్గా ప్రకటించారు. బాధిత వ్యక్తి ఇంటి పరిసరాల్లో అధికారులు పర్యటించి వివ రాలు సేకరించారు. రహదారులు, అంతర్గత రోడ్లను మూసివేశారు. ప్రజలు బయ టికి రాకుండా ప్రచారం చేస్తున్నారు. దగ్గు, జలుబు, జ్వరం సమస్యలతో బాధ పడుతుంటే వైద్యాధికారులకు తెలియజేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
క్వారంటైన్కు 35 మంది
నరసాపురం రూరల్ : మోడి గ్రామంలో రెండు పాజిటివ్ కేసులు వెలుగు చూడటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వ్యాధి సోకిన ఇద్దరికి సంబంధించిన 35 మంది కుటుంబ సభ్యులు, సన్నిహితుల్ని ఆదివారం తాడేపల్లిగూడెం క్వారంటైన్కు తరలించారు. సర్వే నిమిత్తం 12 వైద్య బృందాలను నియమించారు. మోడీతోపాటు ఎల్బీ చర్ల, చామకూరిపాలెం గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి ఎవరైనా దగ్గు, జర్వంతో బాధపడుతున్నారా? అని ఆరా తీస్తున్నారు.