బొగ్గు సంక్షోభం: 14 విద్యుత్ ప్లాంట్ల మూత

ABN , First Publish Date - 2021-10-10T01:13:31+05:30 IST

దేశంలో తలెత్తిన బొగ్గు కొరతతో ఉత్తరప్రదేశ్‌లోని 8 విద్యుత్ ప్లాంట్లు, ఇతర కారణాలతో మరో 6 విద్యుత్ ప్లాంట్లు ..

బొగ్గు సంక్షోభం: 14 విద్యుత్ ప్లాంట్ల మూత

న్యూఢిల్లీ: దేశంలో తలెత్తిన బొగ్గు కొరతతో ఉత్తరప్రదేశ్‌లోని 8 విద్యుత్ ప్లాంట్లు, ఇతర కారణాలతో మరో 6 విద్యుత్ ప్లాంట్లు మూతపడ్డాయి. దీంతో యూపీలో తాత్కాలికంగా మూతపడిన విద్యుత్ ప్లాంట్ల సంఖ్య 14కు చేరింది. ప్రస్తుతం విద్యుత్ డిమాండ్ 20,000 నుంచి 21,000 మెగావాట్లు ఉండగా, సరఫరా 17,000 మెగావాట్లు ఉంది. విద్యుత్ కొరతను అధిగమించేందుకు గ్రామీణ ప్రాంతాల్లో నాలుగు నుంచి ఐదు గంటల విద్యుత్ కోత విధిస్తున్నట్టు అధికారులు ప్రకటించారు.


తాత్కాలికంగా మూతపడిన 14 విద్యుత్ ప్లాంట్లు 4530 మెగావాట్ల విద్యుత్‌ను సరఫరా చేస్తున్నాయి. దీంతో ఎక్స్ఛేంజ్‌పై యూనిట్ విద్యుత్ రేటు రూ.20కి పైనే పెరిగే అవకాశం ఉంది. ఫలితంగా యూపీ ప్రభుత్వం ఒక్కో యూనిట్ రూ.15 నుంచి రూ.20కి కొనుగోలు చేయాల్సి వస్తుంది. అదీగాక, బొగ్గు బకాయిలను అధికారులు ఇంకా చెల్లించాల్సి ఉన్నందున కొత్త బొగ్గు సేకరణ మరింత క్లిష్టమవుతుందని అంటున్నారు.


కాగా, ఉత్తరప్రదేశ్‌తో పాటు పలు ఇతర రాష్ట్రాలు కూడా బొగ్గు కొరతను ఎదుర్కొంటున్నాయి. ఢిల్లీ ప్రభుత్వం కూడా త్వరలోనే ఢిల్లీలో విద్యుత్ కొరత తలెత్తవచ్చంటూ సంకేతాలు ఇచ్చింది. ఈ అసాధారణ పరిస్థితిని తక్షణం పరిగణనలోకి తీసుకోవాలని కోరుతూ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇప్పటికే ప్రధానమంత్రి మోదీకి లేఖ రాశారు.

Updated Date - 2021-10-10T01:13:31+05:30 IST