America లో షాకింగ్ ఘటన.. భారతీయుడ్ని కాల్చి చంపిన 15 ఏళ్ల బాలుడు.. అసలేం జరిగిందంటే..

ABN , First Publish Date - 2021-11-19T19:32:02+05:30 IST

అగ్రరాజ్యం అమెరికాలో దారుణం జరిగింది. 15 ఏళ్ల బాలుడు భారత వ్యక్తిని తుపాకీతో కాల్చి చంపేశాడు.

America లో షాకింగ్ ఘటన.. భారతీయుడ్ని కాల్చి చంపిన 15 ఏళ్ల బాలుడు.. అసలేం జరిగిందంటే..

టెక్సాస్: అగ్రరాజ్యం అమెరికాలో దారుణం జరిగింది. 15 ఏళ్ల బాలుడు భారత వ్యక్తిని తుపాకీతో కాల్చి చంపేశాడు. మృతుడిని కేరళలోని పతనంతిట్టాలోని కోఝేన్‌చెర్రీకి చెందిన సాజన్ మాథ్యూస్‌గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటన బుధవారం మధ్యాహ్నం 1.40 గంటలకు(అమెరికా కాలమానం ప్రకారం) టెక్సాస్ రాష్ట్రంలోని Mesquite నగరంలో చోటు చేసుకుంది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడైన మైనర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సాజన్ మాథ్యూస్‌ Mesquiteలో స్థానికంగా 'బ్యూటీ సప్లై' పేరిట ఓ బ్యూటీ పార్లర్ నడుపుతున్నాడు. ఆ షాపులో మరో వ్యక్తి కూడా భాగస్వామిగా ఉన్నాడు. దీంతో వారంలో ఇద్దరూ చెరో మూడు రోజులు షాపునకు వచ్చేవారు. 


ఈ క్రమంలో బుధవారం సాజన్ వంతు ఉండడంతో షాపునకు వచ్చాడు. ఆ రోజు మధ్యాహ్నం 1.40 గంటల(అమెరికా కాలమానం ప్రకారం) ప్రాంతంలో 15 ఏళ్ల బాలుడు షాపులోకి చోరబడ్డాడు. కౌంటర్‌పై కూర్చున సాజన్‌పై తుపాకీ గురి పెట్టి డబ్బులు ఇవ్వాల్సిందిగా బెదిరించాడు. దాంతో సాజన్ ప్రతిఘటించాడు. భయపడిన బాలుడు విచక్షణరహితంగా అతడిపై కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన సాజన్ అక్కడికక్కడే కుప్పకూలాడు. ఇది గమనించిన కొందరు 911కు కాల్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు షాపులో రికార్డైన సీసీటీవీ కెమెరాలోని దృశ్యాల ఆధారంగా బాలుడి కోసం గాలించారు. కొద్దిసేపటి తర్వాత ఘటన జరిగిన ప్రాంతానికి కొద్దిదూరంలోని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, 52 ఏళ్ల సాజన్ తన కుటుంబంతో కలిసి 2005 నుంచి అమెరికాలో ఉంటున్నట్లు సమాచారం. ఈ ఘటనతో ఆయన స్వస్థలంలో విషాదం అలుముకుంది.    


Updated Date - 2021-11-19T19:32:02+05:30 IST