15 ఏళ్ల ప్రాయంలో చోరీల బాట.. అరెస్ట్
ABN , First Publish Date - 2020-06-09T13:48:46+05:30 IST
ఆ బాలుడి వయస్సు పదిహేనేళ్లు. చెడు మార్గం పట్టిన అతడు అవసరాల కోసం
హైదరాబాద్/సరూర్నగర్ : ఆ బాలుడి వయస్సు పదిహేనేళ్లు. చెడు మార్గం పట్టిన అతడు అవసరాల కోసం సులువుగా డబ్బు సంపాదించాలనుకొని చోరీల బాట ఎంచుకున్నాడు. మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో ఎవరైనా తలుపులు గడియపెట్టకుండా నిద్రపోతే అలాంటి ఇళ్లను గుర్తించి విలువైన వస్తువులు చోరీ చేయడం మొదలుపెట్టాడు. హస్తినాపురం డివిజన్కు చెందిన బాలుడు(15) ఏడో తరగతి వరకు చదివి చదువు మానేశాడు. ఇటీవల మీర్పేట్ పీఎస్ పరిధిలో పలు ఇళ్లలో దొంగతనం చేశాడు.
బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సోమవారం అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరాలు చేస్తున్నట్లు అంగీకరించాడు. నిందితుడి నుంచి ల్యాప్టాప్, రెండు ఎల్ఈడీ టీవీలు, ట్యాబ్, ఎనిమిది స్మార్ట్ ఫోన్లు, గ్యాస్ సిలిండర్ స్వాధీనం చేసుకున్నామని, వాటి విలువ లక్ష రూపాయలు ఉంటుందని డీఐ సత్యనారాయణ తెలిపారు. బాలుడిని జువెనైల్ హోంకు తరలించామని చెప్పారు.