సంతకానికి 150 కోట్లు
ABN , First Publish Date - 2021-10-23T07:43:22+05:30 IST
మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ సంచలన విషయాలు బయటపెట్టారు. తాను జమ్మూకశ్మీర్ గవర్నర్గా ఉన్నప్పుడు అనిల్ అంబానీ....
అనిల్ అంబానీ కంపెనీ ఫైల్పై సంతకం చేస్తే లంచం
ఆరెస్సెస్ సన్నిహితుడి ఫైల్కు మరో రూ.150 కోట్లు
నన్ను ప్రలోభపెట్టబోయిన విషయం ప్రధానికి చెప్పా..
ఆయన నన్ను సమర్ధించారు
కశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ సంచలన వ్యాఖ్యలు
మరో ఫైల్పైనా రూ.150 కోట్లు ఇవ్వజూపారు: సత్యపాల్ మాలిక్
న్యూఢిల్లీ/శ్రీనగర్, అక్టోబరు 22: మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ సంచలన విషయాలు బయటపెట్టారు. తాను జమ్మూకశ్మీర్ గవర్నర్గా ఉన్నప్పుడు అనిల్ అంబానీ గ్రూప్కు చెందిన రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఫైల్ ఒకటి తన వద్దకు వచ్చిందని, ఆ ఫైల్పై సంతకం పెడితే తనకు రూ.150 కోట్ల లంచం ఇస్తామని చెప్పినట్లు ఆయన వెల్లడించారు. ‘‘ఆ ఫైల్ వెనుక కుంభకోణం దాగి ఉందని ప్రభుత్వ కార్యదర్శులు నాకు తెలియజేశారు. ఆ ఫైల్పై సంతకం చేస్తే ‘మీకు రూ.150 కోట్ల లంచం ఇస్తారు’ అని ఆ కార్యదర్శులు నాకు చెప్పారు. కశ్మీర్కు నేను ఐదు జతల కుర్తా-పైజామాలతోనే వచ్చాను. వాటితోనే వెళ్లిపోతానని నేను వారికి జవాబిచ్చాను. అలాగే నా పదవినైనా వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాను తప్ప ఆ ఫైల్పై సంతకం చేయబోనని ప్రధాని నరేంద్ర మోదీకి తెగేసి చెప్పాను. అవినీతిపై రాజీపడాల్సిన అవసరం లేదని ప్రధాని కూడా నా చర్యను సమర్థించారు.
అలాగే ఆరెస్సె్సతో సంబంధం ఉన్న వ్యక్తికి చెందిన ఫైల్ను కూడా నా సంతకం కోసం పంపారు. ఆ ఆరెస్సెస్ వ్యక్తి నాటి పీడీపీ-బీజేపీ కూటమి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. అంతేకాకుండా ప్రధానికి తాను చాలా దగ్గరి మనిషినని కూడా నాకు ఆ వ్యక్తి చెప్పారు. ఆ ఫైల్ వెనుకా కుంభకోణం ఉందని, దానిపై సంతకం చేస్తే రూ.150 కోట్ల లంచం ఇస్తారని కార్యదర్శులు నాకు తెలియజేశారు. దాంతో ఆ ఫైల్పైనా నేను సంతకం చేయలేదు’’ అని మాలిక్ పేర్కొన్నారు. రాజస్థాన్లోని ఝున్ఝునులో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ విషయాన్ని బయటపెట్టారు. ఆ ఫైళ్ల వెనుక దాగి ఉన్న అవినీతి గురించి మోదీకి తాను వివరించానని ఆయన తెలిపారు. ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా కశ్మీర్లోని ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, అక్రెడిటేషన్ కార్డు ఉన్న జర్నలిస్టులకు గ్రూప్ ఇన్సూరెన్స్ కింద ఆరోగ్య బీమా ఇవ్వడానికి రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఒప్పందం కుదుర్చుకుంది. 2018 అక్టోబరులో ఈ ఒప్పందాన్ని నాటి గవర్నర్ సత్యపాల్ మాలిక్ రద్దుచేశారు.
మాలిక్పై ముఫ్తీ రూ.10 కోట్ల దావా
పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ జమ్మూకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్పై రూ.10 కోట్ల దావా వేశారు. ఈ మేరకు ఆయనకు ఆమె తరఫు న్యాయవాది లీగల్ నోటీసు పంపారు. తన పరువుకు భంగం కలిగేలా చేసిన వ్యాఖ్యలను మాలిక్ వెనక్కి తీసుకోవాలని లేకపోతే రూ.10 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని ఆ నోటీసుల్లో ముఫ్తీ హెచ్చరించారు. రోష్నీ పథకంలో ముఫ్తీ కూడా లబ్ధి పొందారని మాలిక్ ఇటీవలే వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. రోష్నీ పథకం అంటే పండిట్లు వదిలేసిన ఆస్తులను కశ్మీర్లోని ముస్లింలకు నామమాత్రపు ధరలకు ఇవ్వడం. నాటి ఫరూక్ అబ్దుల్లా ప్రభుత్వం ఈ చట్టాన్ని అమల్లోకి తెచ్చింది.