162 మంది వీఆర్వోల బదిలీ.. ఐదేళ్ల్ల సీనియార్టీ ఉన్న వాళ్లకు స్థానచలనం

ABN , First Publish Date - 2020-06-30T22:40:29+05:30 IST

ఐదేళ్లపాటు ఒకే మండలంలో పని చేసిన 162 మంది గ్రామరెవెన్యూ కార్యదర్శులను (వీఆర్వో) బదిలీ చేస్తూ కలెక్టర్‌ ఆర్వీకర్ణన్‌ సోమవారం

162 మంది వీఆర్వోల బదిలీ.. ఐదేళ్ల్ల సీనియార్టీ ఉన్న వాళ్లకు స్థానచలనం

ఇంతమొత్తంలో ఇదే తొలిసారి



ఖమ్మం కలెక్టరేట్‌(ఆంధ్రజ్యోతి): ఐదేళ్లపాటు ఒకే మండలంలో పని చేసిన 162 మంది గ్రామరెవెన్యూ కార్యదర్శులను (వీఆర్వో) బదిలీ చేస్తూ కలెక్టర్‌ ఆర్వీకర్ణన్‌ సోమవారం మధ్యాహ్నం ఉత్తర్వులు విడుదల చేశారు. మొత్తం 162 మందికి స్థానచలనం కలిగించారు. కొద్దిరోజులుగా వీఆర్వోలపై ఆరోపణల నేపథ్యంలో సస్పెండ్‌ అయిన 18 మంది వీఆర్వోలకు కూడా ఈ జాబితాలో పోస్టింగ్‌ను కల్పించారు. బదిలీ అయిన వీఆర్వోలు తక్షణమే వారికి కేటాయించిన మండలాల్లో చేరాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటి వరకు వీఆర్వోలకు కౌన్సెలింగ్‌ లేకుండా, వారి పనితీరును బట్టి ఇంత పెద్దమొత్తంలో బదిలీలు నిర్వహించడం ఇదే తొలిసారి. గతంలో వీఆర్వోలకు కౌన్సెలింగ్‌ పద్దతిలో బదిలీలు నిర్వహించే వారు. 


వీటిలో సీనియారిటీతో పాటు భార్యాభర్తలు, అనారోగ్య కారణాలతో ఉన్న వారికి ప్రాధాన్యతను కల్పించేవారు. అయితే ఈ సారి వీఆర్వోల పనితీరును బట్టి నేరుగా బదిలీలు చేయడం గమనార్హం. వీఆర్వోల సంఘం నాయకులు మాత్రం ఈ బదిలీలు నిబంధనలకు విరుద్దంగా చేపట్టారని ఆరోపిస్తున్నారు. కొద్దిరోజులుగా తాము కౌన్సిలింగ్‌ పద్దతిన బదిలీలు చేయాలని కోరుతున్నా.. రాజకీయ ఒత్తిళ్లకు లొంగిపోయి బదిలీలు చేశారంటూ ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గరికె ఉపేంద్రరావు ఆరోపించారు. 

Updated Date - 2020-06-30T22:40:29+05:30 IST