డ్రగ్స్‌, గంజాయి విక్రయాలపై.. ముప్పేట దాడులు

ABN , First Publish Date - 2021-10-25T08:12:29+05:30 IST

హైదరాబాద్‌, శివారు ప్రాంతాల్లో మాదక ద్రవ్యాల విక్రయాలు, వినియోగంపై ఎక్సైజ్‌, పోలీసులు ముప్పేట దాడులు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం వేర్వేరు ప్రాంతాల్లో మొత్తం 17 మందిని అరెస్టు చేసి, వారి..

డ్రగ్స్‌, గంజాయి విక్రయాలపై.. ముప్పేట దాడులు

  • వేర్వేరు ప్రాంతాల్లో 17 మంది అరెస్టు


హైదరాబాద్‌ సిటీ, లంగర్‌హౌస్‌, నేరేడ్‌మెట్‌, పేట్‌బషీరాబాద్‌, షాబాద్‌, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌, శివారు ప్రాంతాల్లో మాదక ద్రవ్యాల విక్రయాలు, వినియోగంపై ఎక్సైజ్‌, పోలీసులు ముప్పేట దాడులు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం వేర్వేరు ప్రాంతాల్లో మొత్తం 17 మందిని అరెస్టు చేసి, వారి నుంచి చరాస్‌, మెథమ్‌ఫేటమైన్‌(మెథ్‌), యాష్‌ ఆయిల్‌(లిక్విడ్‌ గంజాయి), గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. తార్నాకకు చెందిన అబ్దుల్‌ ముదస్సీర్‌, చాంద్రాయణగుట్ట వాసి సయ్యద్‌ గౌసుద్దీన్‌, మైలార్‌దేవ్‌పల్లికి చెందిన మహమ్మద్‌ అస్లం చరాస్‌ సేవిస్తుండగా చార్మినార్‌ ఎక్సైజ్‌ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 10 గ్రాముల చరాస్‌, చరాస్‌ నింపిన ఓ సిగరెట్‌ను సీజ్‌ చేశారు. వారికి చరాస్‌ విక్రయించిన తార్నాక వాసి సయ్యద్‌ ఫైజాన్‌ పరారీలో ఉన్నాడు. లంగర్‌హౌస్‌ పోలీసులు గుడిమల్కాపూర్‌కు చెందిన సాయిరోహిత్‌ సాగర్‌ అలియాస్‌ సాయి, ఉప్పర్‌పల్లికి చెందిన అబ్దుల్‌ హైమద్‌ను అరెస్టు చేసి, వారి నుంచి ఆరు గ్రాముల మెథ్‌ డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నారు.


నేరేడ్‌మెట్‌ పోలీసులు వేర్వేరు ప్రాంతాల్లో జరిపిన దాడుల్లో ఏడుగురిని అరెస్టు చేసి, 40 గ్రాముల బరువున్న యాష్‌ ఆయిల్‌ను సీజ్‌ చేశారు. హైదరాబాద్‌ పశ్చిమ మండలం పోలీసులు హబీబ్‌నగర్‌, మంగళ్‌హాట్‌ ప్రాంతాల్లో నిర్వహించిన దాడుల్లో 18 మందిని అరెస్టు చేసి, 900 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 12 కేసులు నమోదు చేశారు. పేట్‌బషీరాబాద్‌ పోలీసులు ఇద్దరు యువకులను అరెస్టు చేసి, రెండు కిలోల గంజాయిని సీజ్‌ చేశారు. రంగారెడ్డి జిల్లా షాబాద్‌ పరిధిలోని అంతారం వద్ద స్థానిక పోలీసులు ఇద్దరు యువకులను అరెస్టు చేసి, 1.8 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

Updated Date - 2021-10-25T08:12:29+05:30 IST