రాష్ట్రంలో 2.50 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలి
ABN , First Publish Date - 2020-08-14T09:59:29+05:30 IST
రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 2.50 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేసి నిరుద్యోగుల ఆత్మహత్యలను
నిరుద్యోగ భృతి అమలు చేయాలి
సమావేశంలో ఆర్.కృష్ణయ్య డిమాండ్
రాంనగర్, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 2.50 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేసి నిరుద్యోగుల ఆత్మహత్యలను ఆపాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్నికల హామీ మేరకు నిరుద్యోగులకు రూ.3 వేల నిరుద్యోగ భృతిని అమలు చేయాలని కోరారు. గురువారం విద్యానగర్లోని బీసీ భవన్లో నిరుద్యోగ జేఏసీ అధ్యక్షుడు నీలా వెంకటేష్ ఆధ్వర్యంలో 12 నిరుద్యోగ సంఘాలు, విద్యార్థి సంఘాల సమావేశం జరిగింది.
ఈ సమావేశానికి ఆర్.కృష్ణయ్య ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 50వేల టీచర్ పోస్టులను, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నోటిఫికేషన్ జారీ చేసి గ్రూప్-1లో 1600, గ్రూప్-2లో 4వేల పోస్టులు, గ్రూప్-3లో 8వేల పోస్టులతోపాటు క్లరికల్ పోస్టులు 4 వేలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. యూనివర్సిటీలు ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కళాశాలల్లో పాలిటెక్నిక్ కళాశాలల్లో ఖాళీగా ఉన్న 8వేల పోస్టులను, బీసీ, ఎస్సీ, ఎస్టీ గురుకుల పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 4వేల టీచర్ పోస్టులను భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
రిటైర్డ్మెంట్ అయిన వారిని పదవుల్లో కొనసాగించకుండా కొత్త వారికి అవకాశం కల్పించాలని సూచించారు. ఈ సమావేశంలో ఓబీసీ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు అల్లంపల్లి రాంకోటి, బీసీ యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.పాండు, నాయకులు సత్యనారాయణ, చంద్రశేఖర్గౌడ్, మధుసూదన్యాదవ్, మహేందర్గౌడ్ పాల్గొన్నారు.