రూ.2 కోట్లు ఇవ్వాలని మహిళ బ్లాక్మెయిల్
ABN , First Publish Date - 2022-02-08T17:47:44+05:30 IST
ఓ మహిళ తనను బ్లాక్ మెయిల్ చేస్తోందని, రూ.2 కోట్లు ఇవ్వకుంటే తీవ్రస్థాయిలో ఇబ్బందులు పడాల్సి వస్తుందని బెదిరిస్తోందని కలబుర్గి జిల్లా సేడం బీజేపీ ఎమ్మెల్యే రాజ్కుమార్ పాటిల్ తేల్కుర పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ
- సేడం Mla రాజ్కుమార్ పాటిల్ ఫిర్యాదు
బెంగళూరు: ఓ మహిళ తనను బ్లాక్ మెయిల్ చేస్తోందని, రూ.2 కోట్లు ఇవ్వకుంటే తీవ్రస్థాయిలో ఇబ్బందులు పడాల్సి వస్తుందని బెదిరిస్తోందని కలబుర్గి జిల్లా సేడం బీజేపీ ఎమ్మెల్యే రాజ్కుమార్ పాటిల్ తేల్కుర పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమెతోపాటు భర్తపైనా విధానసౌధ పోలీసులకు ఈనెల 5న ఫిర్యాదు చేశారు. పోలీసులు సదరు మహిళను స్టేషన్కు రప్పించి విచారణ జరిపారు. ఈ మేరకు సోమవారం బాధిత మహిళ, ఎమ్మెల్యే రాజ్కుమార్పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే ద్వారా మోసపోయానని ఆరోపించారు. విధానసౌధ పోలీస్ స్టేషన్లో ఆదివారం ఉదయం నుంచి రాత్రిదాకా విచారణ పేరిట వేధించారన్నారు. పోలీస్ స్టేషన్లో విజయ్ అనే అధికారి ఇది ఇతర పార్టీల కుట్రగా చెప్పాలని ఒత్తిడి చేశారన్నారు. బాల్యం నుంచి రాజ్కుమార్ తెలుసని, అలా స్నేహం కలిగి ఆ తర్వాత సంబంధంగా మారిందన్నారు. ప్రస్తుతం 14 ఏళ్ల వయసున్న కుమారుడు రాజ్కుమార్ ద్వారానే జన్మించాడన్నారు. కుమారుడిగా హక్కులు కావాలని, తమకు డబ్బులు వద్దన్నారు. తన కుమారుడు కాదని ఎమ్మెల్యే దేవుడిపై ప్రమాణం చేస్తారా..? అని ప్రశ్నించారు. సదరు మహిళ తొలిభర్తకు విడాకులు ఇచ్చి ఆరేళ్ల క్రితం రెండో వివాహం చేసుకున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. ఎమ్మెల్యే ఫిర్యాదు మేరకు మహిళకు నోటీసులు జారీ చేశారు.