రూ.2 లక్షల నగదు పరిమితి ఎత్తివేత?
ABN , First Publish Date - 2021-05-08T09:12:18+05:30 IST
ఆస్పత్రుల్లో కొవిడ్ చికిత్సకు రూ.2 లక్షల నగదు లావాదేవీల పరిమితిని ఎత్తి వేసే అంశాన్ని ‘చురుగ్గా పరిశీలిస్తున్నామ’ని ఢిల్లీ హైకోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఆదాయ పన్ను
చురుగ్గా పరిశీలిస్తున్నామన్న కేంద్రం
ఢిల్లీ హైకోర్టుకు చెప్పిన న్యాయవాది
పరిమితితో కొవిడ్ చికిత్సకు ఇబ్బందులు
ఆస్పత్రుల నిరాకరణతో చికిత్సలో జాప్యం
ఢిల్లీ హైకోర్టులో మనీషా గుప్తా పిటిషన్
రూ.2 లక్షల నగదు పరిమితి ఎత్తివేత
ఢిల్లీ హైకోర్టుకు తెలిపిన కేంద్రం
న్యూఢిల్లీ, మే 7: ఆస్పత్రుల్లో కొవిడ్ చికిత్సకు రూ.2 లక్షల నగదు లావాదేవీల పరిమితిని ఎత్తి వేసే అంశాన్ని ‘చురుగ్గా పరిశీలిస్తున్నామ’ని ఢిల్లీ హైకోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 269 ఎస్టీ ప్రకారం ఒక వ్యక్తి నుంచి రూ.2 లక్షల కంటే ఎక్కువ నగదును తీసుకోవడానికి వీల్లేదని, ఈ పరిమితి కారణంగా ఆస్పత్రుల్లో కొవిడ్ చికిత్సకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని మనీషా గుప్తా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రూ.2 లక్షల కంటే ఎక్కువ నగదును తీసుకోవడానికి ఆస్పత్రులు నిరాకరిస్తున్నాయని, దాంతో, చికిత్స ఆలస్యమవుతోందని తెలిపారు.
ఈ పిటిషన్ను జస్టిస్ విపిన్ సంఘి, జస్టిస్ రేఖా పల్లిలతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారించింది. ఈ అంశంపై తమకు సోమవారం వివరాలు ఇవ్వాలని ఆర్థిక శాఖ తరఫు న్యాయవాదిని కోరింది. అయితే, ఈ అంశం తమ దృష్టికి వచ్చిందని, కేంద్రం దీనిని చురుగ్గా పరిశీలిస్తోందని, అతి త్వరలోనే సంబంధిత ఉత్తర్వులు జారీ చేసే అవకాశాలు ఉన్నాయని ఆర్థిక శాఖ తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు.