ప్రతి ఒక్కరికి రూ. 93 వేలు

ABN , First Publish Date - 2020-03-26T08:34:50+05:30 IST

కరోనా దెబ్బకు కుదేలైన అమెరికన్‌ పౌరులను ఆదుకొనేందుకు, ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు.. ట్రంప్‌ ప్రభుత్వం రెండు లక్షల కోట్ల డాలర్ల ప్యాకేజీ ప్రకటించింది

ప్రతి ఒక్కరికి రూ. 93 వేలు

అమెరికాలో 2 లక్షల కోట్ల డాలర్ల ప్యాకేజీ

మాంద్యంలోకి నెట్టేస్తే మా వాళ్లు  ఆత్మహత్య చేసుకుంటారు: ట్రరప్‌

వాషింగ్టన్‌, మార్చి 25: కరోనా దెబ్బకు కుదేలైన అమెరికన్‌ పౌరులను ఆదుకొనేందుకు, ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు.. ట్రంప్‌ ప్రభుత్వం రెండు లక్షల కోట్ల డాలర్ల ప్యాకేజీ ప్రకటించింది. దాని ప్రకారం.. 75 వేల డాలర్లలోపు ఆదాయం ఉన్న వారందరి ఖాతాల్లో 1,200 డాలర్ల (రూ.93 వేలు)చొప్పున జమ కానున్నాయి. 1.5 లక్షల డాలర్లలోపు ఆదాయం ఉన్న దంపతులకు 2,400 డాలర్లు (రూ.1.86 లక్షలు), పిల్లలకు ఒక్కొక్కరికి 500 డాలర్ల వంతున ఇవ్వనున్నారు. ‘‘అమెరికన్లు తిరిగి పనిలోకి వెళ్లాలని కోరుకుంటున్నారు. అమెరికాను షట్‌డౌన్‌ చేయలేం. సమస్య కంటే పరిష్కారం అధ్వానంగా ఉండకూడదు’’ అని వ్యాఖ్యానించారు.


‘‘ఫ్లూ వల్ల చాలామందిని కోల్పోతాం. కానీ, దేశాన్ని తీవ్ర మాంద్యంలోకి, నిస్పృహలోకి నెట్టేస్తే ఇంకా ఎక్కువ మందిని కోల్పోతాం. వేల మంది ఆత్మహత్యలు చేసుకుంటారు’’ అన్నారు. ట్రంప్‌ వ్యాఖ్యలను మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ తప్పుపట్టారు. షట్‌డౌన్‌ చేయకపోవడంతో వైరస్‌ను నియంత్రించే అవకాశాన్ని అమెరికా చేజార్చుకుందన్నారు. కరోనాతో వందల మంది మరణించారని, ఈ పరిస్థితుల్లో ఆర్థిక కార్యకలాపాలను తిరిగి ప్రారంభించాలనుకోవడం బాధ్యతారహితమని విమర్శించారు. ‘ఆర్థిక వ్యవస్థకు తిరిగి జీవం పోయచ్చు. కానీ, పోయినవారిని బతికించలేమ’ని హితవు పలికారు. కాగా, కరోనా వైరస్‌ పరీక్ష కిట్లు కావాలని అమెరికా దక్షిణ కొరియాను కోరింది. భారత్‌లో 21 రోజుల లాక్‌డౌన్‌ మాదిరిగా అమెరికా కూడా చర్యలు చేపట్టాలని ‘న్యూయార్క్‌ టైమ్స్‌’ సూచించింది.

Updated Date - 2020-03-26T08:34:50+05:30 IST