20 ఏళ్లు జైల్లో మగ్గి..నిర్దోషిగా విడుదల!

ABN , First Publish Date - 2021-03-04T07:22:04+05:30 IST

అతడు 23 ఏళ్ల వయసులో ఓ రేప్‌ కేసులో అరెస్టయ్యాడు. మూడేళ్లు జైల్లో మగ్గిన తర్వాత.. కోర్టు దోషిగా తేల్చి 10 ఏళ్లు జైలు శిక్ష వేసింది. ఎస్సీ ఎస్టీ వేధింపుల చట్టం కింద జీవిత ఖైదు విధించింది. అతడు హైకోర్టుకు వెళ్లాడు

20 ఏళ్లు జైల్లో మగ్గి..నిర్దోషిగా విడుదల!

  • శరీరం నాశనమైపోయిందంటూ 
  • యూపీ వాసి ఆవేదన

ఆగ్రా, మార్చి 3: అతడు 23 ఏళ్ల వయసులో ఓ రేప్‌ కేసులో అరెస్టయ్యాడు. మూడేళ్లు జైల్లో మగ్గిన తర్వాత.. కోర్టు దోషిగా తేల్చి 10 ఏళ్లు జైలు శిక్ష వేసింది. ఎస్సీ ఎస్టీ వేధింపుల చట్టం కింద జీవిత ఖైదు విధించింది. అతడు హైకోర్టుకు వెళ్లాడు. అక్కడ కేసు సా..గుతూ వచ్చింది. అంతలోనే ఏళ్లు గడిచిపోయాయి. చివరికి ఈ జనవరిలో అతడు నిర్దోషి అని కోర్టు తీర్పు చెప్పింది. దీంతో.. అతడు బుధవారం జైలు నుంచి విడుదలయ్యాడు. చేయని నేరానికి 20 ఏళ్లు జైల్లో మగ్గిన ఆ దురదృష్టవంతుడి పేరు విష్ణు తివారీ. ఊరు.. ఉత్తరప్రదేశ్‌లోని లలిత్‌పూర్‌.


ప్రస్తుత వయసు 43 ఏళ్లు. విడుదల అవుతున్న క్షణంలో అతడి కళ్లలో నైరాశ్యం, దేహంలో నీరసం. జైలు నుంచి తీసుకెళ్లేందుకు కూడా ఎవరూ రాలేదు. ‘‘ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు బయటికొచ్చి నేనేం చేయగలను. జైల్లోనే నా ఒళ్లు హూనమైపోయింది. నా కుటుంబం కూడా నాశనమైపోయింది. ఓ సోదరుడు మినహా.. నాకంటూ ఎవరూ లేకుండా పోయారు. నా జీవితం జైల్లో వంట గదికే పరిమితమైపోయింది. ఈ రోజు విడుదలయ్యే నాటికి నా చేతిలో రూ. 600 మాత్రమే ఉంది’’ అంటూ వాపోయాడు. ఎక్కడో జరిగిన తప్పునకు సగం జీవితంతో పాటు.. కుటుంబాన్ని కోల్పోయి.. ఒంటరిగా మిగిలిపోయాడు విష్ణు తివారీ.

Updated Date - 2021-03-04T07:22:04+05:30 IST