12 ఏళ్ల బాలుడిపై 21 ఏళ్ల యువతి కేసు.. లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఫిర్యాదు
ABN , First Publish Date - 2020-05-22T21:53:53+05:30 IST
12 ఏళ్ల బాలుడు లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన ఫోటోలను...
ఘజియాబాద్: 12 ఏళ్ల బాలుడు లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన ఫోటోలను నగ్న చిత్రాలతో మార్ఫింగ్ చేసి వాటిని తనకు పంపిస్తున్నాడని ఆరోపించింది. ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో నివశిస్తున్న 21 ఏళ్ల యువతి ఈ మేరకు పోలీసులను ఆశ్రయించింది. ఆన్లైన్లో సెక్స్ చాట్ చేయాలని, లేకపోతే ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరిస్తున్నాడని తెలిపింది. దీనికి ఆధారంగా తన మొబైల్కు ఆ బాలుడు పంపించిన మెసేజ్లు, ఫోటోలకు సంబంధించి 18 స్క్రీన్ షాట్లను పోలీసులకు అందించింది.
దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు బాలుడిని విచారించగా ఆ ఫోటోలు, మెసెజ్లు తాను పంపలేదని, తన మొబైల్ ఫోన్ను ఎవరో హ్యాక్ చేశారని చెప్పుకొచ్చాడు. ఇదే విషయాన్ని అతడి తల్లిదండ్రులు కూడా చెప్పారు. అయితే వీరిద్దరూ టెలిగ్రాం అప్లికేషన్లోని ఓ గ్రూప్లో సభ్యులుగా ఉన్నారని, అక్కడి నుంచే ఈ బాలుడు ఆమె ఫోన్ నెంబరు సంపాదించి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.