బీబీనగర్ ఎయిమ్స్కు రూ.23.85 కోట్లే
ABN , First Publish Date - 2021-05-19T09:23:24+05:30 IST
యాదాద్రి-భువనగిరి జిల్లాలోని బీబీనగర్లో రూ.1028 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న ఎయిమ్స్కు కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కేవలం రూ.23.85 కోట్లనే విడుదల చేసింది.
మంగళగిరి ఎయిమ్స్కు రూ.879 కోట్లు
ఆర్టీఐకి సమాధానమిచ్చిన కేంద్రం
హైదరాబాద్, మే 18(ఆంధ్రజ్యోతి): యాదాద్రి-భువనగిరి జిల్లాలోని బీబీనగర్లో రూ.1028 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న ఎయిమ్స్కు కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కేవలం రూ.23.85 కోట్లనే విడుదల చేసింది. దేశంలోని 13 ఎయిమ్స్లకు విడుదల చేసిన నిధులతో పోలిస్తే ఇది అతి స్వల్పం కావడం గమనార్హం. రవికుమార్ ఇనుగంటి అనే వ్యక్తి దాఖలు చేసిన ఆర్టీఐ దరఖాస్తుకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సమాధానమిచ్చింది. బీబీనగర్ ఎయిమ్స్ నిర్మాణం వచ్చే ఏడాది సెప్టెంబర్లో పూర్తవుతుందని తెలిపింది. తమిళనాడులోని మదురై ఎయిమ్స్ను జపాన్ ఇంటర్నేషనల్ కోపరేషన్ ఏజెన్సీ(జేఐసీఏ) సహకారంతో రూ.1264 కోట్లతో నిర్మిస్తున్నామని, అందుకే దానికి తక్కువగా రూ.12.35 కోట్లను విడుదల చేసినట్లు పేర్కొంది. ఆంధ్రప్రదేశ్లోని మంగళగిరి ఎయిమ్స్ను రూ.1618 కోట్లుతో నిర్మిస్తుండగా.. ఇప్పటికే రూ.879 కోట్లను విడుదల చేశామని తెలిపింది. మహారాష్ట్రలోని నాగపూర్ ఎయిమ్స్కు రూ.945కోట్లు, పశ్చిమ బెంగాల్లోని కళ్యాణి ఎయిమ్స్కు 966కోట్లు, ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ ఎయిమ్స్కు 755కోట్లను విడుదల చేసినట్లు ఆర్టీఐకి ఇచ్చిన సమాధానంలో పేర్కొంది.