25 నుంచి బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలు

ABN , First Publish Date - 2021-10-23T06:05:06+05:30 IST

కోనసీమ తిరుపతి వాడపల్లి శ్రీవేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలను తిరుమల తరహాలో నిర్వహించేందుకు చర్యలు చేపట్టారు.

25 నుంచి బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలు

ఆత్రేయపురం, అక్టోబరు 22: కోనసీమ తిరుపతి వాడపల్లి శ్రీవేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలను తిరుమల తరహాలో నిర్వహించేందుకు చర్యలు చేపట్టారు. ఈనెల25 నుంచి వచ్చే నెల రెండో తేదీ వరకు బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలను కొవిడ్‌ నిబంధనల ప్రకారం అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. వైఖానస ఆగమశాస్త్ర ప్రకారం వేదపండితులు, అర్చకుల వేదమంత్రోచ్ఛారణల నడుమ నిర్వహిస్తారు. 25న శేషవాహనసేవ, 26న హంసవాహన సేవ, 27న హనుమద్వాహన సేవ, 28న సింహవాహన సేవ, 29న గరుడవాహన సేవ, 30న సూర్యప్రభ, చంద్రప్రభ వాహన సేవలు, 31 ఆదివారం గజవాహన సేవ, నవంబరు 1న అశ్వవాహన సేవ, 2న చక్రస్నాన మహోత్సవాలను కనుల పండువగా జరపనున్నారు. శ్రీనివాస కల్యాణం, వేంకటేశ్వరస్వామి హోమం, మహాసుదర్శన హోమం, అష్టోత్తర కలశాభిషేకం, సహస్ర దీపాలంకరణ సేవ, లక్ష కుంకుమార్చన, తిరుప్పావడ సేవ, అభిషేకాలు, పుష్పయాగం తదితర ఆర్జిత సేవలు నిర్వహిస్తారు. చైర్మన్‌ రమేష్‌రాజు శుక్రవారం అమలాపురం ఎంపీ చింతా అనురాధను కలిసి బ్రహ్మోత్సవాల ఆహ్వానపత్రిక అందజేశారు. ఉత్సవాలకు ఏర్పాట్లు చురుగ్గా చేస్తున్నామని ఈవో ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు.


Updated Date - 2021-10-23T06:05:06+05:30 IST