ఉన్నత చదువుల కోసం.. గతేడాది విదేశాలకు వెళ్లిన భారతీయులు ఎంతమందంటే..

ABN , First Publish Date - 2021-03-25T14:42:01+05:30 IST

ఉన్నత చదువుల కోసం గతేడాది విదేశాలకు వెళ్లిన భారతీయుల వివరాలను తాజాగా ప్రభుత్వం వెల్లడించింది.

ఉన్నత చదువుల కోసం.. గతేడాది విదేశాలకు వెళ్లిన భారతీయులు ఎంతమందంటే..

న్యూఢిల్లీ: ఉన్నత చదువుల కోసం గతేడాది విదేశాలకు వెళ్లిన భారతీయుల వివరాలను తాజాగా ప్రభుత్వం వెల్లడించింది. 2020లో సుమారు 2,61,406 మంది విదేశాలకు వెళ్లినట్లు ప్రభుత్వ డేటా చెబుతోంది. బుధవారం లోక్‌సభలో విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీ మురళీధరన్ ఓ ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ సమాచారం ప్రకారం.. 2016లో 3,71,506 మంది భారతీయులు చదువు కోసం విదేశాలకు వెళ్లగా.. 2017లో 4,56,823 మంది, 2018లో 5,20,342 మంది, 2019లో 5,88,931 మంది, 2020లో 2,61,406 మంది వెళ్లినట్లు మంత్రి వివరించారు. అలాగే హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం గడిచిన ఐదేళ్లలో(2016 జనవరి 1 నుంచి 2021 మార్చి 18 వరకు) ఉద్యోగ వీసాపై 1,37,26,945 మంది భారతీయులు విదేశాలకు వెళ్లినట్లు పేర్కొన్నారు. ఇక గతేడాది మే 6న ప్రారంభమైన 'వందే భారత్ మిషన్' ద్వారా 2020 మార్చి 22 వరకు సుమారు 52 లక్షల మంది భారతీయులను స్వదేశానికి తరలించినట్లు మంత్రి వెల్లడించారు. దీనికి అదనంగా 'వందే భారత్ మిషన్' ద్వారానే పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సుమారు 67.9 లక్షల మంది ప్రజలకు అంతర్జాతీయ ప్రయాణానికి వీలు కల్పించిందని మంత్రి తెలిపారు.  

Updated Date - 2021-03-25T14:42:01+05:30 IST