బెళగావిలో చెలరేగిన హింస, 27 మంది అరెస్ట్
ABN , First Publish Date - 2021-12-18T23:53:09+05:30 IST
బెంగళూరులోని సదాశివ నగర్లో ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహానికి
బెళగావి : బెంగళూరులోని సదాశివ నగర్లో ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహానికి అపచారం జరగడంతో శుక్రవారం రాత్రి బెళగావిలో పెద్ద ఎత్తున విధ్వంసకాండ జరిగింది. కొన్ని ప్రాంతాల్లో అప్రకటిత బంద్ పాటించారు. ఈ నేపథ్యంలో 27 మందిని పోలీసులు అరెస్టు చేశారు. కొందరు నేతలను కస్టడీలోకి తీసుకున్నారు.
ధర్మవీర్ శంభాజీ మహరాజ్ విగ్రహానికి నల్లని రంగును పూసినట్లు సామాజిక మాధ్యమాల్లో రావడంతో బెళగావిలోని ధర్మవీర్ శంభాజీ సర్కిల్ వద్ద పెద్ద ఎత్తున యువత ఆందోళన చేశారు. ఈ సంఘటనను ఖండిస్తూ ధర్నా నిర్వహించారు. ఈ అపచారం చేసినవారిని తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
శుక్రవారం రాత్రి ఆగ్రహంతో ఊగిపోయిన యువత 12 వాహనాలను ధ్వంసం చేశారు. వీటిలో ఆరు ప్రభుత్వ వాహనాలు, నాలుగు పోలీసు వాహనాలు, రెండు ప్రైవేటు వాహనాలు ఉన్నాయి. కంగ్రలి గ్రామంలో ఓ ఆర్టీసీ బస్సును ధ్వంసం చేశారు.
పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. బెళగావి కమిషనరేట్ పరిధిలో శనివారం ఉదయం 8 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు సీఆర్పీసీ సెక్షన్ 144ను అమలు చేస్తున్నట్లు నగర పోలీసు కమిషనర్ త్యాగరాజన్ చెప్పారు. ఈ విధ్వంసకాండకు సంబంధించి మూడు కేసులను నమోదు చేసినట్లు చెప్పారు.
పోలీసు వర్గాలను ఉటంకిస్తూ ఓ వార్తా సంస్థ తెలిపిన వివరాల ప్రకారం, శ్రీరామ్ సేన హిందుస్థాన్ రమాకాంత్ కొండుస్కర్, ఎంఈఎస్ నేత శుభం షేల్కేలను హిందలగ జైలుకు 14 రోజుల రిమాండ్కు తరలించారు.
శివాజీ గార్డెన్లోని ఛత్రపతి శివాజీ మహరాజ్కు పూజ చేసేందుకు వెళ్తున్న శివసేన జిల్లా అధ్యక్షుడు ప్రకాశ్, మహారాష్ట్ర ఏకీకరణ్ సమితి (ఎంఈఎస్) నేత శివాజీ సుంత్కర్లను పోలీసులు అరెస్టు చేసి, కాసేపటి తర్వాత విడుదల చేశారు.
బెంగళూరులో జరిగిన సంఘటనను ఖండిస్తూ బెళగావితోపాటు పరిసర ప్రాంతాల్లో మహిళలతో సహా హిందూ కార్యకర్తలు ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహాలకు అభిషేకాలు, పూజలు నిర్వహించారు.