Bangalore IT కంపెనీల్లో వీరు చేస్తున్నపనికి అంతా షాక్
ABN , First Publish Date - 2021-11-14T15:50:38+05:30 IST
ఎలక్ట్రానిక్ సిటీ బెంగళూరులోని ఓ ఐటీ కంపెనీలో ముగ్గురు ఉద్యోగులు చాకచక్యంగా..
బెంగళూరు: ఎలక్ట్రానిక్ సిటీ బెంగళూరులోని ఓ ఐటీ కంపెనీలో ముగ్గురు ఉద్యోగులు చాకచక్యంగా 1,070 ల్యాప్టాప్లు మాయం చేశారు. వీటి విలువ సుమారు రూ.32 లక్షలు వరకూ ఉంటుంది. ముగ్గురూ 30 ఏళ్ల లోపువారే. ఎట్టకేలకు వీరి గుట్టురట్టు కావడంతో పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు ముగ్గురూ సంస్థలో సర్వీస్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
ల్యాప్టాప్ల చోరీ వ్యవహారం గత అక్టోబర్ 15న వెలుగు చూసింది. సంస్థ ఎలక్ట్రానిక్ ఛాంబర్లో 10 ల్యాప్ట్యాప్లు ఉండటం సెక్యూరిటీ సూపర్వైజర్ సాజి మాన్ జానీ తొలుత గుర్తించాడు. ముగ్గురు ఉద్యోగులు తరచు ఛాంబర్కు వచ్చి వెళ్తుండటం, ల్యాప్టాప్లు మాయమవుతుండటం గమనించాడు. ఇదే విషయాన్ని అతను సీనియర్ల దృష్టికి తీసుకు వెళ్లడంతో శాఖాపరమైన దర్యాప్తు జరిపారు. ఈ విచారణలో 2020 సంవత్సరం ద్వితీయార్థం నుంచి 2021 అక్టోబర్ వరకూ 1,070 ల్యాప్టాప్లు మాయమైనట్టు గుర్తించారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ముగ్గురు నిందితులపై ఐపీసీ 381 కింద కేసు నమోదు చేశారు. నిందితులు స్టోర్రూమ్లోకి ప్రవేశించి సీసీటీవీ కెమెరాలు ఆపేసేవారని, ఆ తర్వాత ల్యాప్టాప్లు తీసుకుని ఉడాయించేవారని జానీ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా, నిందితులను ఐదురోజుల పాటు కస్టడీలోకి తీసుకున్నారు.