నమాజ్ చేస్తుండగా నిరసన.. 30 మంది అరెస్ట్
ABN , First Publish Date - 2021-10-29T21:07:50+05:30 IST
ఈ విషయమై స్థానిక పోలీసు అధికారి ఒకరు మాట్లాడుతూ ‘‘ప్రస్తుతం పరిస్థితి బాగానే ఉంది. నమాజ్కు ఇబ్బంది కలిగించాలని చూసిన వ్యక్తుల్ని అరెస్ట్ చేశాం. అంతే కాకుండా 37 ప్రాంతాల్లో సెక్యూరిటీని ఏర్పాటు చేశాం. గతవారం కూడా ఇలాంటి ఘటన..
న్యూఢిల్లీ: ఢిల్లీకి సమీపంలోని గురుగ్రామ్ సెక్టార్ 12-ఏలో ఉన్న మసీదు వద్ద మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముస్లింలు నమాజ్ చేస్తుండగా రైట్ వింగ్కు చెందిన కొంత మంది వ్యక్తులు నమాజ్కు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో నిరసనకు దిగిన వారిలో 30 మందిని స్థానిక పోలీసులు అరెస్ట్ చేశారు. కొద్ది రోజుల క్రితం ఇదే గురుగ్రామ్లోని ఓ మసీదు వద్ద సరిగ్గా నమాజ్ చేస్తున్న సమయంలోనే రైట్ వింగ్కు చెందిన కొంత మంది ‘జై శ్రీరాం’ నినాదాలు ఇస్తూ ఆందోళన నిర్వహించారు. కాగా తాజా ఘటనలో గురుగ్రామ్ పరిపాలనా విభాగంపై రైట్ వింగ్ కార్యకర్తలు మండపడ్డారు. ‘గురుగ్రామ్ పాలనాధికారులారా నిద్ర వదిలించుకుని లేవండి’ అంటూ నినాదాలు చేశారు.
ఈ విషయమై స్థానిక పోలీసు అధికారి ఒకరు మాట్లాడుతూ ‘‘ప్రస్తుతం పరిస్థితి బాగానే ఉంది. నమాజ్కు ఇబ్బంది కలిగించాలని చూసిన వ్యక్తుల్ని అరెస్ట్ చేశాం. అంతే కాకుండా 37 ప్రాంతాల్లో సెక్యూరిటీని ఏర్పాటు చేశాం. గతవారం కూడా ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. వారిపై కూడా త్వరితగతిన చర్యలు తీసుకుంటాం’’ అని అన్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల్లో ‘ఆపేయండి.. ఆపేయండి’ అని నినాదాలు చేయడం రికార్డైంది. మరో వీడియోలో ఘటనా స్థలంలో భారీ ఎత్తున మోహరించిన పోలీసులను చూడొచ్చు.