30 గ్రామాలకు వరద హెచ్చరిక
ABN , First Publish Date - 2021-11-20T14:48:35+05:30 IST
రాణిపేట జిల్లా వాలాజాపేట చెక్ డ్యామ్ వద్ద వందేళ్ల తర్వాత సెకనుకు 1.05 లక్షల ఘనపుటడుగుల చొప్పున జలాలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఆ చెక్ డ్యామ్లోకి ప్రవేశించే జలాలను నిల్వ చేసేందుకు వీలు లేకపోవడంతో ఆ
- వందేళ్ల తర్వాత పాలారులో 1.05లక్షల ఘనపుటడుగుల నీరు విడుదల
చెన్నై: రాణిపేట జిల్లా వాలాజాపేట చెక్ డ్యామ్ వద్ద వందేళ్ల తర్వాత సెకనుకు 1.05 లక్షల ఘనపుటడుగుల చొప్పున జలాలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఆ చెక్ డ్యామ్లోకి ప్రవేశించే జలాలను నిల్వ చేసేందుకు వీలు లేకపోవడంతో ఆ పరిమాణంతోనే జలాలను ఎప్పటికప్పుడు విడుదల చేస్తుండటంతో 30 గ్రా మాలకు వరద హెచ్చరికలు జారీ చేశారు. ఈశాన్య రుతుపవనాలు, బంగాళాఖాతంలో వాయుగుండం కారణంగా రాణిపేట జిల్లాకు రెడ్ అలెర్ట్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం నుంచి ఆ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పాలారు వద్ద వరద పరిస్థితి నెలకొంది. వందేళ్ల తర్వాత పెన్నైయారు, పాలారు నుంచి సెకనుకు 1.05 లక్షల ఘనపుటడుగుల మేర విడుదలైన జలాలు వాలాజా ఆనకట్ట చెక్ డ్యామ్లోకి ప్రవేశించాయి. వచ్చిన నీటిని పూర్తిగా విడుదల చేశారు. ఆ ఆనకట్టకు సమీపంలో ఉన్న సుమారు 30కి పైగా గ్రామాల్లో వరద హెచ్చరికలు జారీ చేశారు. ఆ ప్రాంతాల్లో నివసిస్తున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇదిలా ఉండగా వాలాజా సమీపం సాదిక్ బాషానగర్లో పాలారుకు చేరువగా ఉన్న 300 నివాసగృహాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఆ ఇళ్ళలో నివసిస్తున్న 1200 మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పాలారు ఆనకట్ట వద్దకు జిల్లా కలెక్టర్ భాస్కర పాండ్యన్ అధికారులతో వెళ్ళి పరిశీలించారు.