31మంది ఎస్జీటీల బదిలీ

ABN , First Publish Date - 2021-06-24T06:49:09+05:30 IST

మున్సిపాలిటీల పరిధిలోని మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలల్లో పనిచేస్తున్న 31మంది సెకండరీ గ్రేడ్‌ తెలుగు, ఉర్దూ ఉపాధ్యాయులను వివిధ మండలాలకు బదిలీ చేస్తూ డీఈవో వి.ఎస్‌.సుబ్బారావు బుధవారం ఉత్తర్వులు జారీచేశారు.

31మంది ఎస్జీటీల బదిలీ
కౌన్సెలింగ్‌ నిర్వహించి బదిలీ ఉత్తర్వులు ఇస్తున్న డీఈవో సుబ్బారావు

ఒంగోలు విద్య, జూన్‌ 23: మున్సిపాలిటీల పరిధిలోని మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలల్లో పనిచేస్తున్న 31మంది సెకండరీ గ్రేడ్‌ తెలుగు, ఉర్దూ ఉపాధ్యాయులను వివిధ మండలాలకు బదిలీ చేస్తూ డీఈవో వి.ఎస్‌.సుబ్బారావు బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. స్థానిక డీఆర్‌ఆర్‌ఎం హైస్కూలులో ఉదయం 10గంటలకు నిర్వహించిన బదిలీల కౌన్సెలింగ్‌లో 27మంది ఎస్జీటీ తెలుగు, నలుగురు ఎస్జీటీ ఉర్దూ టీచర్లను బదిలీ చేశారు. గతేడాది జరిగిన బదిలీల కౌన్సెలింగ్‌లో వీరందరూ తప్పనిసరిగా బదిలీ కావాల్సి ఉన్నప్పటికీ హైకోర్టును ఆశ్రయించి మధ్యంతర ఉత్తర్వులు పొందారు. తాజాగా వాటిని హైకోర్టు రద్దుచేయడంతో వీరందరినీ కేటగిరీ 4, 3 పాఠశాలలకు బదిలీ చేయాలని పాఠశాల విద్య డైరెక్టర్‌ వి.చినవీరభద్రుడు ఉత్తర్వులిచ్చారు. దీంతో బుధవారం కౌన్సెలింగ్‌ నిర్వహించి గతేడాది జరిగిన బదిలీల్లో మిగిలిపోయిన కేటగిరీ 3, 4 ప్రాంతాల్లోని పాఠశాలల్లో నియమించారు. వైపాలెం, పుల్లలచెరువు, త్రిపురాంతకం, పెదదోర్నాల, పెద్దారవీడు, దొనకొండ, లింగసముద్రం మండలాల్లోని పాఠశాలలకు వీరిని బదిలీ చేశారు. వారందరికి బదిలీ ఉత్తర్వులు అందజేసి వెంటనే కొత్త పాఠశాలల్లో చేరాలని డీఈవో ఆదేశించారు. కార్యక్రమంలో కందుకూరు ఉపవిద్యాధికారి సమా సుబ్బారావు పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-24T06:49:09+05:30 IST