మంత్రులతో పాటు తృణమూల్ నేతలకు బెయిల్ మంజూరు
ABN , First Publish Date - 2021-05-18T02:14:08+05:30 IST
నారద స్కాంలో అరెస్టైన నలుగురు తృణమూల్ నేతలకు సీబీఐ కోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేసింది
కోల్కతా : నారద స్కాంలో అరెస్టైన నలుగురు తృణమూల్ నేతలకు సీబీఐ కోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేసింది. నారద స్కాంలో ప్రమేయం ఉందంటూ మంత్రులు ఫిర్హాద్ హకీమ్, సుబ్రతా బెనర్జీతో పాటు మరో ఇద్దరు నేతల్ని సీబీఐ అరెస్ట్ చేసింది. అరెస్ట్ చేసిన ఏడు గంటల్లోనే వారికి సీబీఐ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
నారద కుంభకోణం కేసులో పశ్చిమ బెంగాల్ మంత్రి ఫిర్హాద్ హకీంతో పాటు మరో మంత్రి సుబ్రతా బెనర్జీని కూడా సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. వీరితో పాటు మరో ఇద్దరు టీఎంసీ నేతలను కూడా సీబీఐ అరెస్ట్ చేసింది. దీనిని నిరసిస్తూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఇతర టీఎంసీ నేతలందరూ సీబీఐ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. ఈ నలుగుర్నీ ఎలాంటి నిబంధనలను పాటించకుండానే అరెస్ట్ చేశారని, తనను కూడా అరెస్ట్ చేయాలని మమత డిమాండ్ చేశారు. దాదాపు నాలుగు గంటల పాటు మమత సీబీఐ ఆఫీసు ముందు ఉండిపోయారు. ఆ తర్వాత కోర్టు చూసుకుంటుందంటూ అక్కడి నుంచి నిష్క్రమించారు.