ఒక్కరోజులో కోలుకున్న నాలుగు లక్షలకుపైగా కరోనా బాధితులు!
ABN , First Publish Date - 2021-05-19T11:17:35+05:30 IST
దేశంలో తొలిసారిగా ఒక్కరోజులో నాలుగు లక్షలకుపైగా...
న్యూఢిల్లీ: దేశంలో తొలిసారిగా ఒక్కరోజులో నాలుగు లక్షలకుపైగా కరోనా బాధితులు వ్యాధి నుంచి బయటపడ్డారు. గడచిన 24 గంటల్లో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 4,22,436. కరోనా వ్యాప్తి చెందిన తరువాత ఒక్క రోజులో అత్యధిక సంఖ్యలో కరోనా బాధితులు కోలుకోవడం ఇదే తొలిసారి. మే ౩ న దేశంలో రికవరీ రేటు 81.7 శాతంగా ఉందని, ఇది మంగళవారం నాటికి 85.6 శాతానికి పెరిగిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ తెలిపారు. కాగా రాబోయే రెండు వారాల్లో తమిళనాడు, అసోం, పంజాబ్లలో కరోనా వైరస్ కేసులు గరిష్టస్థాయికి చేరుకోవచ్చని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఈ సమాచారాన్ని 'ఫార్ములా' మోడల్ ఆధారంగా గ్రహించారు. ఈ గణిత నమూనా కరోనా వైరస్ కేసుల తీవ్రతను అంచనా వేయడానికి సహాయపడుతుంది. ఈ మోడల్ ప్రకారం, ఢిల్లీ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్, మధ్యప్రదేశ్లలో వైరస్ కేసులు గరిష్టస్థాయికి చేరుకున్నాయి. మే 4 న దేశంలో కేసులు గరిష్టస్థాయికి చేరుకున్నాయని, ఆ తర్వాత రోజువారీ కేసులు తగ్గడం ప్రారంభమయ్యిందని ప్రభుత్వం తెలిపింది. అయితే, దేశంలో మే 7న 4,14,188 కేసులు నమోదయ్యాయి, ఇది ఒక్కరోజులో అత్యధికంగా నమోదైన కేసుల సంఖ్య. తమిళనాడు, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, అస్సాం వంటి పెద్ద రాష్ట్రాలకు ఇంతకుమించిన స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యే పరిస్థితి లేదని ప్రొఫెసర్ ఎం విద్యాసాగర్ తెలిపారు. ఈ నమూనాపై పనిచేస్తున్న ముగ్గురు శాస్త్రవేత్తలలో ఆయన ఒకరు. మే 29-31 మధ్య తమిళనాడులో కరోనా కేసులు పీక్ స్టేజికి చేరుకుంటాయని, పుదుచ్చేరిలో మే 19-20 మధ్య అత్యధిక కరోనా కేసులు నమోదుకావచ్చని ఈ మోడల్ సూచిస్తోంది. ఈ నమూనా ప్రకారం, తూర్పు, ఈశాన్య భారతదేశంలో గరిష్టస్థాయిలో కేసులు నమోదయ్యే పరిస్థితి లేదు.