అట్టుడుకుతున్న అమెరికా.. నలుగురు పోలీసు అధికారులపై కాల్పులు

ABN , First Publish Date - 2020-06-02T22:31:51+05:30 IST

అమెరికా నిరసనలతో అట్టుడుకుతోంది. తెల్ల పోలీసు చేతుల్లో నల్ల జాతీయుడు

అట్టుడుకుతున్న అమెరికా.. నలుగురు పోలీసు అధికారులపై కాల్పులు

సెయింట్ లూయిస్: అగ్రరాజ్యం అమెరికా నిరసనలతో అట్టుడుకుతోంది. తెల్ల పోలీసు చేతుల్లో నల్ల జాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ మరణించడంతో దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. శాంతియుతంగా మొదలైన ఈ నిరసనలు ప్రస్తుతం హింసాత్మకంగా మారాయి. సోమవారం సెయింట్ లూయిట్‌ నగరంలో ఏకంగా నలుగురు పోలీసుల అధికారులపై నిరసనకారులు కాల్పులు జరిపినట్టు సెయింట్ లూయిస్ పోలీసులు తెలిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు పోలీసులకు కాళ్లపై, ఒకరికి చేతిపై, మరొకరికి అరికాళ్లపై గాయాలయ్యాయి. పోలీసు అధికారులు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు తెలుస్తోంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పోలీసులకు ఎటువంటి ప్రమాదం లేదని ఇప్పటికే వైద్యులు నిర్థారించారు. అయితే ఈ కాల్పులు ఎవరు జరిపారన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. సోమవారం మిసౌరి రాష్ట్రంలోని సెయింట్ లూయిస్‌ నగరంలో వందలాది మంది ఆందోళనకారులు జస్టిస్ సెంటర్ ప్రాంతంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మేయర్ లైడా క్రూసన్, సెయింట్ లూయిస్ సేఫ్టీ డైరెక్టర్ జిమ్మీ ఎడ్వార్డ్స్ కూడా పాల్గొన్నారు. అనంతరం నిరసనకారులు పోలీస్ హెడ్‌క్వార్టర్స్ దగ్గరకు చేరుకోగానే.. పోలీసులు టియర్ గ్యాస్‌ను ప్రయోగించారు. ఈ సమయంలో పోలీసులపై కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు తాము ఎంతగానో ప్రయత్నిస్తున్నామని పోలీస్ చీఫ్ జాన్ హేడన్ తెలిపారు. పోలీసులపై కాల్పులు జరపడం దారుణమని ఆయన అన్నారు.

Updated Date - 2020-06-02T22:31:51+05:30 IST