ఓడల్లో చిక్కుకుపోయిన 40 వేల మంది భారతీయ నావికులు

ABN , First Publish Date - 2020-04-05T21:26:34+05:30 IST

కరోనా వైరస్ విస్తరించకుండా దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 40 వేల మంది

ఓడల్లో చిక్కుకుపోయిన 40 వేల మంది భారతీయ నావికులు

న్యూఢిల్లీ: కరోనా వైరస్ విస్తరించకుండా దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 40 వేల మంది భారతీయ నావికులు, సిబ్బంది చిక్కుకుపోయారు. లాక్‌డౌన్ ఎత్తివేసిన తర్వాత వారందరినీ స్వదేశం తీసుకొస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినట్టు మారిటైం సంఘాలు చెబుతున్నారు. వీరంతా సరుకు రవాణా, యుద్ధ నౌకలు తదితర వాటిలో చిక్కుకుపోయారు. 500 సరుకు రవాణా ఓడల్లో దాదాపు 15 వేల మంది నావికులు చిక్కుకుపోగా, 25,000 మంది యుద్ధ నౌకల్లో ఉన్నారు. షిప్పింగ్ మినిస్ట్రీ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లామని, ఓడల్లో చిక్కుకున్న వారిని సురక్షితంగా తీసుకొచ్చేందుకు అవసరమైన సాయం చేస్తామని హామీ ఇచ్చినట్టు మారిటైం సంఘాలు ఎన్‌యూఎస్ఐ, ఎంయూఐ ఎంఏఎస్ఎస్ఏ వంటివి తెలిపాయి.


‘‘కార్గో, క్రూయిజ్ షిప్‌లలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 40 వేల మంది భారతీయ నావికులు చిక్కుకుపోయారు. వారి ఉద్యోగ కాంట్రాక్టులు ముగిసిపోవడంతో  స్వదేశం వచ్చేందుకు వేచి చూస్తున్నారు’’ అని మారిటైం అసోసియేషన్ ఆఫ్ షిప్ ఓనర్స్, షిప్ మేనేజర్స్ అండ్ ఏజెంట్స్ (ఎంఏఎస్ఎస్ఏ) సీఈవో కెప్టెన్ శివ్ హల్బే తెలిపారు. 


చిక్కుకుపోయిన నావికుల విషయాన్ని షిప్పింగ్ మంత్రి మన్‌సుఖ్ లాల్ మనడావియా దృష్టికి తీసుకెళ్లామని, లాక్‌డౌన్ ఎత్తివేసిన తర్వాత వారందరినీ క్షేమంగా దేశానికి తీసుకొస్తామని హామీ ఇచ్చారని శివ్ హల్బే తెలిపారు. అయితే, నావికులందరికీ కోవిడ్ పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుందని, ఆ తర్వాత క్వారంటైన్‌కు కానీ, ఐసోలేషన్ సెంటర్లకు కానీ పంపిస్తామని మంత్రి తెలిపారు. 

Updated Date - 2020-04-05T21:26:34+05:30 IST