436 రోజుల తర్వాత బ్యాట్ పడుతున్న ధోనీ!
ABN , First Publish Date - 2020-09-19T21:43:13+05:30 IST
టీమిండియా మాజీ సారథి, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ 436 రోజుల తర్వాత మళ్లీ మైదానంలోకి
దుబాయ్: టీమిండియా మాజీ సారథి, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ 436 రోజుల తర్వాత మళ్లీ మైదానంలోకి దిగుతున్నాడు. ప్రపంచ కప్ తర్వాత క్రికెట్కు దూరంగా ఉంటూ వచ్చిన ధోనీ, అంతర్జాతీయ క్రికెట్ నుంచి అనూహ్యంగా తప్పుకున్నాడు. మరికొన్ని గంటల్లో అబుదాబిలో ముంబై ఇండియన్స్తో జరగనున్న ఐపీఎల్ తొలి పోరులో ధోనీ తిరిగి బ్యాట్ పట్టనుండడంతో అందరి కళ్లూ ఇప్పుడు అతడిపైనే ఉన్నాయి.
చివరిసారి మైదానంలోకి దిగిన 436 రోజుల తర్వాత, అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పిన 34 రోజుల తర్వాత ధోనీ మళ్లీ మైదానంలోకి దిగబోతున్నాడు. సాధారణంగా ఐపీఎల్లో ధోనీ మైదానంలోకి దిగుతుంటే పసుపు పచ్చని జెర్సీలు ధరించిన ఫ్యాన్స్ ‘ధోనీ.. ధోనీ’ అంటూ చేసే నినాదాలు మైదానంలో మార్మోగుతాయి. కానీ ఈసారి మాత్రం ఆ నినాదాలు వినిపించే అవకాశం లేదు. కరోనా నేపథ్యంలో క్లోజ్డ్ డోర్స్ మధ్య మ్యాచ్లు జరుగుతుండడంతో ప్రేక్షకులకు అవకాశం లేకుండా పోయింది. సుదీర్ఘ విరామం తర్వాత బ్యాట్ పట్టనున్న ధోనీ కోసం క్రికెట్ ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.