కేరళలో దారుణం.. 17 ఏళ్ల అమ్మాయిపై 44 మంది అఘాయిత్యం

ABN , First Publish Date - 2021-01-20T00:29:18+05:30 IST

కేరళలోని మలప్పురం జిల్లాలో దారుణం జరిగింది. 17 ఏళ్ల అమ్మాయిపై వేధింపులకు పాల్పడడంతోపాటు

కేరళలో దారుణం.. 17 ఏళ్ల అమ్మాయిపై 44 మంది అఘాయిత్యం

మలప్పురం: కేరళలోని మలప్పురం జిల్లాలో దారుణం జరిగింది. 17 ఏళ్ల అమ్మాయిపై వేధింపులకు పాల్పడడంతోపాటు అత్యాచారం చేసినందుకు 44 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. జిల్లాలోని పండిక్కాడ్ ప్రాంతంలో జరిగిందీ దారుణం. ఇప్పటి వరకు ఈ కేసులో 20 మందిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు సోమవారం తెలిపారు. బాధిత బాలిక ప్రస్తుతం ప్రభుత్వ బాలికా సంరక్షణ కమిటీ రక్షణలో ఉన్నట్టు చెప్పారు. 


డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పీపీ శామ్స్ కథనం ప్రకారం.. బాధిత బాలిక 2016లో ఒకసారి, 2017లో మరోమారు లైంగిక వేధింపులకు గురైంది. తాజా ఘటన మూడోది. తాను మూడుసార్లు లైంగిక వేధింపులకు గురైనట్టు మేజిస్ట్రేట్ ఎదుట బాలిక 164 స్టేట్‌మెంట్లు ఇచ్చినట్టు డీఎస్పీ తెలిపారు. 


2016లో ఒకసారి, 2017 ఒకసారి బాలిక లైంగిక వేధింపులకు గురైందని, అప్పుడు ఆమె వయసు 13 ఏళ్లని షామ్స్ పేర్కొన్నారు. ఈ ఘటన తర్వాత ఆమెను నిర్భయ షెల్టర్ హోంకు తరలించామని, అక్కడి నుంచి బంధువుల ఇంటికి పంపించినట్టు తెలిపారు. అక్కడామె మూడోసారి లైంగిక వేధింపులకు గురైంది పేర్కొన్నారు.


ఈ కేసులో మొత్తం 44 మంది అనుమానితులు ఉన్నారని, వీరిలో నమోదైన కేసుల్లో ఏడు  తీవ్రమైనవని డీఎస్పీ పేర్కొన్నారు. తీవ్రమైన కేసుల్లో ఉన్న నిందితులను అరెస్ట్ చేసినట్టు తెలిపారు. మిగతా నిందితులను అరెస్ట్ చేయాల్సి ఉందన్నారు. ఇప్పటి వరకు 20 మందిని అరెస్ట్ చేసినట్టు చెప్పారు. 


నిందితుల్లో చాలామంది ఒకే ప్రాంతానికి చెందినవారు కావడం గమనార్హం. ఈ ఘటన వెనక వ్యక్తిగత కక్షలు, ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా? అన్న విషయం గురించి ఆలోచిస్తున్నట్టు చెప్పారు. బాధితురాలు ఇప్పుడు రక్షణలో ఉందని, ఎవరూ ఆమెను భయపెట్టడం కానీ, ప్రలోభాలకు గురి చేయడం కానీ చేయలేరని పేర్కొన్నారు. దర్యాప్తు కొనసాగుతున్నట్టు డీఎస్పీ తెలిపారు.

Updated Date - 2021-01-20T00:29:18+05:30 IST