హెచ్ఎండీఏలో 50 శాతమే విధులు
ABN , First Publish Date - 2021-05-07T18:15:22+05:30 IST
హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ)లో 50శాతం ఉద్యోగులే విధులు..
- రెండు విభాగాలుగా ఉద్యోగులు
- రోజు విడిచి రోజు కార్యాలయానికి
హైదరాబాద్ సిటీ : హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ)లో 50శాతం ఉద్యోగులే విధులు నిర్వహిస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ ఉధృతిలో అమీర్పేటలోని హెచ్ఎండీఏ ప్రధాన కార్యాలయంలో పలువురు కరోనా బారిన పడ్డారు. కొంతమంది ఆస్పత్రుల పాలయ్యారు. మరికొంతమంది హోం క్వారంటైన్లో ఉండి చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో హెచ్ఎండీఏ ఉన్నతాధికారులు కట్టడి చర్యలు చేపట్టారు. ఉన్నతాధికారులు, ఉద్యోగులు, సిబ్బందిని రెండు కేటగిరిలుగా విభజించారు. హెచ్ఎండీఏలోని ఇంజనీరింగ్ విభాగం, ప్లానింగ్, ఎన్ఫోర్స్మెంట్, అడ్మినిస్ర్టేషన్, బుద్ద పూర్ణిమ, అర్బన్ ఫారెస్ర్టీ, హెచ్జీసీఎల్ ఇలా పలు విభాగాల్లో రోజు వారీగా 50 శాతం మంది మాత్రమే విధులకు వచ్చేలా ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చారు. దీంతో ఉద్యోగులు రోజు విడిచి రోజు కార్యాలయానికి వస్తున్నారు. సందర్శకుల రాకపై కూడా ఆంక్షలు విధించారు.