చెన్నైకి 500 క్యూసెక్కుల తెలుగుగంగ నీళ్లు

ABN , First Publish Date - 2021-06-15T05:19:46+05:30 IST

చెన్నై ప్రజల తాగునీటి అవసరాలకుగాను కండలేరు జలాశయం నుంచి 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.

చెన్నైకి 500 క్యూసెక్కుల తెలుగుగంగ నీళ్లు
నీటి విడుదలను పర్యవేక్షిస్తున్న సీఈ తదితరులు

శ్రీకాళహస్తి, జూన్‌ 14: చెన్నై ప్రజల తాగునీటి అవసరాలకుగాను సోమవారం నెల్లూరు జిల్లాలోని కండలేరు జలాశయం నుంచి 500 క్యూసెక్కుల నీటిని తిరుపతి తెలుగుగంగ చీఫ్‌ ఇంజనీరు హరినారాయణరెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఈ ఏడాది సెప్టెంబరు ఆఖరి వరకు చెన్నైకి నీటి తరలింపు జరుగుతుందని వివరించారు. కాగా, ఖరీఫ్‌ సీజన్‌లో చిత్తూరు, నెల్లూరు జిల్లాల పరిధిలోని 2 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించినట్లు చెప్పారు. ఆ మేరకు.. తెలుగుగంగ కాలువ కింద రెండవ పంట సాగు కోసం ఈ ఏడాది ఏప్రిల్‌లో మొత్తం 1,600 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు గుర్తుచేశారు. ఖరీఫ్‌ సీజన్‌లో రెండవ పంటకు భారీస్థాయిలో గంగ నీటిని విడుదల చేయడం ఇటీవల కాలంలో ఇదే మొదటిసారని వివరించారు. కండలేరు జలాశయం నుంచి గత ఏడాది 8.20 టీఎంసీల నీటిని విడుదల చేయడం చరిత్రలో ఇదో రికార్డని పేర్కొన్నారు. ఆయకట్టు రైతులు నీటిని దుర్వినియోగం చేయకుండా పంటలు సాగు చేసుకోవాలని ఆయన సూచించారు. 

Updated Date - 2021-06-15T05:19:46+05:30 IST