మహానది నుంచి బయటపడిన 500 ఏండ్ల ఆలయం
ABN , First Publish Date - 2020-06-15T00:48:13+05:30 IST
ఒడిశాలోని ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్ (ఇంటాక్) చేపట్టిన ఓ ప్రాజెక్టు పనుల్లో శతాబ్దాల క్రితం నాటి పురాతన..
న్యూఢిల్లీ: ఒడిశాలోని ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్ (ఇంటాక్) చేపట్టిన ఓ ప్రాజెక్టు పనుల్లో శతాబ్దాల క్రితం నాటి పురాతన ఆలయం బయటపడింది. సుమారు 500 ఏళ్ల క్రితం మహానదిలో మునిగిపోయిన ఈ ఆలయం తిరిగి నది నుంచి బయటపడినట్టు ఇంటాక్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ అనిల్ ధీర్ వెల్లడించారు. కటక్లోని బైదేశ్వర్ ఆలయం సమీపాన నది మధ్యలో ఈ ఆలయాన్ని కనుగొన్నట్టు ఆదివారంనాడు ఆయన మీడియాకు తెలిపారు.
ఆలయ నిర్మాణ శైలి, అందుకోసం ఉపయోగించిన పరికరాలను పరిశీలిస్తే 15 లేదా 16వ శతాబ్దం ప్రధమార్థంలో దీన్ని నిర్మించినట్టు తెలుస్తోందని అన్నారు. ఆలయాన్ని సరైన ప్రదేశానికి తరలించి, తిరిగి ఆలయ పునరుద్ధరణ చేపట్టేందుకు వీలుగా ఈ విషయాన్ని భారత పురావస్తు శాఖ (ఏఎస్ఐ) దృష్టికి తెస్తామన్నారు. త్వరలోనే లేఖ రాయనున్నట్టు చెప్పారు. ఆలయం తరలింపునకు తగిన సాంకేతికత అవసరమని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని ఏఎస్ఐ దృష్టికి తీసుకువెళ్లాలని అనిల్ ధీర్ సూచించారు.