దేశంలో మరింతగా తగ్గిన కరోనా కేసుల సంఖ్య... 30 కోట్లు దాటిన వ్యాక్సినేషన్
ABN , First Publish Date - 2021-06-24T16:00:43+05:30 IST
దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ జోరందుకోవడంతో...
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ జోరందుకోవడంతో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 54 వేల 69 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 68 వేల 885 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 6 లక్షల 27 వేలు. వరుసగా 42 రోజుల తరువాత దేశంలో అతి తక్కువ కరోనా కేసులు నమోదయ్యాయి.
ప్రస్తుతం దేశంలో కరోనా నుంచి కోలుకుంటున్నవారి రేటు 96.61 శాతానికి పెరిగింది. అదే సమయంలో కరోనా వ్యాప్తి రేటు స్థిరంగా 5 శాతం కంటే తక్కువగా కొనసాగుతోంది. ప్రస్తుతం ఇది 3.04 శాతంగా ఉంది. వరుసగా 17 వ రోజు రోజువారీ కరోనా వ్యాప్తి రేటు 5 శాతం కంటే తక్కువగా ఉంది. దేశవ్యాప్తంగా గత 3 రోజులుగా రికార్టు స్థాయిలో వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. మొదటి రోజు 86 లక్షలకుపైగా జనాభాకు టీకాలు వేయగా, రెండవ రోజు ఈ సంఖ్య 54 లక్షలుగా ఉంది. గడచిన 24 గంటల్లో 64.89 లక్షలమందికి టీకాలు వేశారు. ఇప్పటివరకు దేశంలో మొత్తం 30.16 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్ వేశారు. ఐసీఎంఆర్ తెలిపిన వివరాల ప్రకారం జూన్ 23 నాటి వరకు భారతదేశంలో మొత్తం 39 కోట్ల 78 లక్షల 32 వేల 66 వేల కరోనా టెస్టులు జరిగాయి.