షాంపూ బాటిళ్లలో డ్రగ్స్.. షాకైన దుబాయి అధికారులు
ABN , First Publish Date - 2021-03-02T13:38:46+05:30 IST
షాంపూ బాటిళ్లలో డ్రగ్స్ను సరఫరా చేస్తూ దొరికిపోయిన మహిళ దుబాయి కోర్టులో విచారణను ఎదుర్కొంటోంది.
దుబాయి: షాంపూ బాటిళ్లలో డ్రగ్స్ను సరఫరా చేస్తూ దొరికిపోయిన మహిళ దుబాయి కోర్టులో విచారణను ఎదుర్కొంటోంది. కోర్టు తెలిపిన వివరాల ప్రకారం.. ఆసియాకు చెందిన 56 ఏళ్ల మహిళ గతేడాది నవంబర్లో విదేశాల నుంచి దుబాయి ఎయిర్పోర్టుకు వచ్చింది. ఎయిర్పోర్టులో ఆమె ప్రవర్తన అధికారులకు అనుమానం కలిగించింది. ఆమె లగేజ్లో అక్రమంగా ఏదో తరలిస్తున్నట్టు కస్టమ్స్ ఇన్స్పెక్టర్కు అనుమానం కలగడంతో లగేజ్ను చెక్ చేయాలంటూ సిబ్బందిని ఆదేశించారు.
లగేజ్ను తనిఖీ చేయగా అధికారులకు మూడు షాంపూ బాటిళ్లు దొరికాయి. మూడు బాటిళ్ల లోపల 22 చిన్న ప్యాకెట్లు కనిపించాయి. ఈ ప్యాకెట్లలో మొత్తం 746 గ్రాముల డ్రగ్స్ను మహిళ సరఫరా చేస్తున్నట్టు అధికారులు తెలుసుకున్నారు. అధికారులు డ్రగ్స్ను వెంటనే సీజ్ చేసి మహిళను అదుపులోకి తీసుకున్నారు. అక్రమంగా డ్రగ్స్ను సరఫరా చేసిందన్న ఆరోపణలతో ఆమె ప్రస్తుతం దుబాయి క్రిమినల్ కోర్టులో విచారణను ఎదుర్కొంటోంది.