చరిత్రలో ఈరోజు: మాజీ ప్రధాని ఇందిర హత్య జరిగిన రోజు ఏం జరిగింది? హంతకులు ఎలా పట్టుబడ్డారంటే..

ABN , First Publish Date - 2022-01-06T15:33:56+05:30 IST

మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హత్యకేసులో..

చరిత్రలో ఈరోజు: మాజీ ప్రధాని ఇందిర హత్య జరిగిన రోజు ఏం జరిగింది? హంతకులు ఎలా పట్టుబడ్డారంటే..

మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హత్యకేసులో సత్వంత్ సింగ్, కేహర్ సింగ్‌లను 1989, జనవరి 6న ఉరితీశారు. ఇందిరా గాంధీ అంగరక్షకులైన బియాంత్ సింగ్, సత్వంత్ సింగ్‌లు ఇందిరాగాంధీని 1984 అక్టోబరు 31న కాల్చి చంపారు. ఇందిర చేపట్టిన ఆపరేషన్ బ్లూ స్టార్‌తో వీరిద్దరూ కలత చెందారని చెబుతారు. ఈ హత్య కేసులో మూడో వ్యక్తి ప్రమేయం కూడా ఉంది. అతని పేరు కేహర్ సింగ్. అయితే కేహర్‌కు తుపాకీ కాల్పులతో సంబంధం లేదని, హత్యకు కుట్ర పన్నాడని వెల్లడయ్యింది. ఇందిరపై కాల్పులు జరిపిన బియాంత్ సింగ్‌ను భద్రతా సిబ్బంది కాల్చి చంపారు. ఇందిరా గాంధీ 1984, అక్టోబరు 31న ఉదయం 9 గంటలకు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి బయటకు వచ్చారు. ఇంతలో అకస్మాత్తుగా ఆమెకు రక్షణగా ఉన్న సెక్యూరిటీ గార్డు బియాంత్ సింగ్ తన సర్వీస్ రివాల్వర్‌తో ఇందిరా గాంధీపై మూడు బుల్లెట్లు కాల్చాడు. అనంతరం తనకు కొంచెం దూరంలో నిలబడి ఉన్న సత్వంత్ సింగ్‌ని చూసి గట్టిగా అరుస్తూ.. ఏం చూస్తున్నావ్? బుల్లెట్లు కాల్చు.. అని అన్నాడు. సత్వంత్ వెంటనే తన ఆటోమేటిక్ కార్బైన్‌లోని మొత్తం 25 బుల్లెట్లను ఇందిరా గాంధీపై గురిపెట్టి కాల్చాడు.




ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఇందిరను వెంటనే ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఇది జరిగిన సుమారు 4 గంటల తర్వాత అదేరోజు మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఆమె మరణించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. కాగా బియాంత్ సింగ్, సత్వంత్ సింగ్‌లను ఇతర భద్రతా సిబ్బంది పట్టుకున్నారు. ఈ సమయంలో బియాంత్ సింగ్ తప్పించుకునే ప్రయత్నం చేయగా, భద్రతా సిబ్బంది అతనిపై కాల్పులు జరిపి మట్టుపెట్టారు. ఈ ఘటనలో సత్వంత్ సింగ్‌ను అరెస్టు చేశారు. ఇందిరా గాంధీని హత్య చేసిన వారిద్దరూ ఆపరేషన్ బ్లూ స్టార్‌కు ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నారనే కథనాలు వెలువడ్డాయి. సిక్కుల పవిత్ర క్షేత్రమైన స్వర్ణ దేవాలయంలో ఖలిస్తాన్ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా సైన్యం సహాయంతో ఇందిర నిర్వహించిన ఆపరేషన్ బ్లూ స్టార్‌లో వందలాది మంది చనిపోయారు. ఇందిర హత్య కేసులో సత్వంత్‌తో పాటు హత్యకు కుట్ర పన్నిన కేహర్ సింగ్, బల్వంత్ సింగ్‌లను కూడా విచారించారు. తగిన సాక్ష్యాధారాలు లేకపోవడంతో బల్వంత్ సింగ్ జైలు నుంచి విడుదలయ్యాడు, ఇందిరపై కాల్పులు జరిపిన సత్వంత్ సింగ్‌కు, హత్యకు కుట్రపన్నిన కేహర్ సింగ్‌కు కోర్టు మరణశిక్ష విధించింది. ఇందిర మరణించిన 5 సంవత్సరాల తరువాత, సత్వంత్ సింగ్ (54 సంవత్సరాలు), కేహర్ సింగ్ (26 సంవత్సరాలు)లకు తీహార్ జైలులో 1989 జనవరి 6న ఉరి శిక్ష అమలు చేశారు. అనంతరం ఆ ఇద్దరి మృతదేహాలను వారి బంధువులకు కూడా అప్పగించలేదు, జైలు అధికారులే అంత్యక్రియలు నిర్వహించారు.

Updated Date - 2022-01-06T15:33:56+05:30 IST