కవలలను ఉయ్యాలలో ఉంచి పనిలోకి వెళ్లారు.. స్థానికులు కంగారు పెట్టడంతో పరుగుపరుగున వచ్చారు.. ఇంతలోనే ఘోరం జరిగిపోయింది..

ABN , First Publish Date - 2021-11-10T16:06:44+05:30 IST

రాజస్థాన్‌లోని కోట్రాలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది.

కవలలను ఉయ్యాలలో ఉంచి పనిలోకి వెళ్లారు.. స్థానికులు కంగారు పెట్టడంతో పరుగుపరుగున వచ్చారు.. ఇంతలోనే ఘోరం జరిగిపోయింది..

రాజస్థాన్‌లోని కోట్రాలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. అగ్నిప్రమాదంలో ఆరు నెలల కవల అక్కాచెల్లెళ్లు మృతి చెందారు. మాండ్వా పోలీస్ స్టేషన్ పరిధిలోని సామోలీ పంచాయతీకి చెందిన జామ్వా ఫలా గ్రామంలో ముక్కుపచ్చలారని ఇద్దరు చిన్నారులు సజీవ దహనమయ్యారు. ఆరు మాసాల వయసుగల వీరిద్దరూ ఇంటిలో అంటుకున్న నిప్పుకు ఆహుతయ్యారు. ఆ  చిన్నారుల మృతదేహాలను పోస్టుమార్టం కోసం పోలీసులు కోట్రా సీహెచ్సీ మార్చురీకి తరలించారు. వివరాల్లోకి వెళితే జమ్వా ఫలా నివాసి ఉజ్మా అతని భార్య పని కోసం పొలానికి వెళ్లారు. వారి కవల కుమార్తెలను ఇంటిలో చీరతో వేసిన ఉయ్యాలలో పడుకోబెట్టివారు పనిలోకి వెళ్లారు.


దీనికి ముందు ఇంటిలో పొయ్యి వెలిగించారు. దానిని పూర్తిగా ఆర్పివేయకుండానే ఆ చిన్నారుల తల్లిదండ్రులు పనిలోకి వెళ్లిపోయారు. ఇంతలో పొయ్యిలోని నిప్పు రాజుకుని పూరిపాకకు అంటుకుంది. వెంటనే మంటలు ఆ పాక అంతటా వ్యాపించాయి. దీంతో స్థానికులు మంటలను ఆర్పే ప్రయత్నం చేయడంతోపాటు, ఆ చిన్నారుల తల్లిదండ్రులకు కబురంపారు. వారు వచ్చేలోగానే చిన్నారులిద్దరి శరీరం చాలావరకూ కాలిపోయింది. వెంటనే బాధితులను సీహెచ్సీకి తీసుకు వెళ్లారు. అక్కడి వైద్యులు చిన్నారుల పరిస్థితిని గమనించి, వెంటనే ఉదయ్‌పూర్ ఆసుపత్రికి తీసుకువెళ్లాలని సూచించారు. వైద్యుల సలహా మేరకు బాధితులను ఉదయ్‌పూర్ తీసుకువెళుతుండగా దారిలోనే చిన్నారులిద్దరూ మృతిచెందారు. దీంతో చిన్నారుల మృతదేహాలతో సహా గ్రామానికి చేరుకున్న తల్లిదండ్రులు పోలీసులకు ఈ విషయాన్ని తెలియజేశారు. వారు వెంటనే బాధితుల ఇంటికి చేరుకుని, చిన్నారుల మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-11-10T16:06:44+05:30 IST