ఆరుగురు పోలీసులను సస్పెండ్ చేసిన మహేష్ భగవత్
ABN , First Publish Date - 2020-05-31T13:23:54+05:30 IST
రాచకొండలో డీజిల్ దొంగలను పసిగట్ట లేకపోవడంతో పాటు, వారికి పరోక్షంగా సహకరించినట్లు
హైదరాబాద్ : రాచకొండలో డీజిల్ దొంగలను పసిగట్ట లేకపోవడంతో పాటు, వారికి పరోక్షంగా సహకరించినట్లు నిర్ధారణ కావడంతో రాచకొండ సీపీ మహేష్ భగవత్ ఆరుగురు పోలీసులను సస్పెండ్ చేశారు. ఒక్కసారిగా ఆరుగురు సస్పెండ్ కావడం తీవ్ర సంచలనంగా మారింది. ఈ నెల 18న మేడిపల్లి పరిధిలోని చర్లపల్లిలో ట్యాంకర్ల నుంచి డీజిల్ దొంగిలించి బ్లాక్ మార్కెట్లో అమ్ముతూ లక్షల రూపాయలు కొల్లగొడుతున్న ముఠా ఆటకట్టించారు రాచకొండ పోలీసులు.
వారి నుంచి 20,400 లీటర్ల డీజిల్, రూ. 13,87,200 నగదు స్వాధీనం చేసుకున్నారు. ముఠాలో ఆరుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని విచారించగా, కొందరు పొలీసు సిబ్బంది వారికి సహకరిస్తున్నట్లు తేలింది. మేడిపల్లి పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ముగ్గురు కానిస్టేబుళ్లు, ఒక ఎస్బీ కానిస్టేబుల్, ఒక ఎస్వోటీ ఇన్స్పెక్టర్, మరో హెడ్ కానిస్టేబుల్కు ప్రమేయం ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీంతో వీరిని సస్పెండ్ చేస్తున్నట్లు సీపీ ప్రకటించారు. ఇంకా విచారణ కనసాగుతోంది. మరికొంతమంది పోలీసుల ప్రమేయం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. నేడో రేపో వారిపై కూడా సీపీ వేటు వేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.