Indian Embassy: కువైత్‌లోని 65 మంది భారత ప్రవాసులకు తలో రూ. 1లక్ష పరిహారం

ABN , First Publish Date - 2021-08-17T13:23:31+05:30 IST

కువైత్‌లోని భారత ఎంబసీ కరోనా సంక్షోభ సమయంలో ప్రవాసులను ఆదుకునే దిశగా గత నెలాఖరున కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే.

Indian Embassy: కువైత్‌లోని 65 మంది భారత ప్రవాసులకు తలో రూ. 1లక్ష పరిహారం

కువైత్ సిటీ: కువైత్‌లోని భారత ఎంబసీ కరోనా సంక్షోభ సమయంలో ప్రవాసులను ఆదుకునే దిశగా గత నెలాఖరున కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. కువైత్‌లో కరోనాతో చనిపోయిన అల్పాదాయ వర్గానికి చెందిన భారత ప్రవాసులకు పరిహారం రూపంలో రూ. లక్ష ఇవ్వనున్నట్లు ప్రకటించింది. జులై 28న జరిగిన ఓపెన్ హౌస్ కార్యక్రమంలో భారత రాయబారి సిబి జార్జి ఈ ప్రకటన చేశారు. దీనిలో భాగంగా 75 స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని 65 మంది భారత ప్రవాసులకు ఆదివారం పరిహారం నగదు అందజేసినట్లు రాయబారి తెలిపారు. ఎంబసీ ఏర్పాటు చేసిన ఇండియన్ కమ్యూనిటీ సపోర్ట్ గ్రూపు(ఐసీఎస్‌జీ) ఆధ్వర్యంలో ఈ ఆర్థికసాయం అందజేశారు. 120 కువైటీ దినార్ల కంటే తక్కువ వేతనం పొందుతున్న భారత ప్రవాసులు ఈ పరిహారం పొందెందుకు అర్హులు. 


ఇక పరిహారం పంపిణీపై పర్యవేక్షణ కోసం ఎంబసీ తరఫున ముగ్గురు అధికారుల ఆధ్వర్యంలో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసినట్లు రాయబారి వెల్లడించారు. అర్హులైన లబ్ధిదారులకు మాత్రమే పరిహారం అందాలనేది తమ లక్ష్యమని ఈ సందర్భంగా సిబి జార్జి పేర్కొన్నారు. లక్ష రూపాయలు అనేది పెద్ద మొత్తం కాదని తెలుసు, కానీ మృతుల కుటుంబానికి ఇది ఏదో ఒక రకంగా సహాయపడుతుందని రాయబారి అన్నారు. అర్హులైన వారిని ఎంబసీ అధికారులు గుర్తించి వారి కుటుంబ సభ్యులకు ఈ నగదు అందజేయస్తారని అంబాసిడర్ తెలిపారు. కాగా, ఇప్పటివరకు కువైత్‌లో 540 మంది భారతీయులు కరోనాతో చనిపోగా, వీరిలో వంద మంది కంటే ఎక్కువ 120 కేడీల కంటే తక్కువ జీతం గలవారేనని సమాచారం.    

Updated Date - 2021-08-17T13:23:31+05:30 IST