అంతర్జాతీయ ప్రయాణికులకు 7 రోజుల పెయిడ్ క్వారంటైన్
ABN , First Publish Date - 2020-08-03T00:48:16+05:30 IST
ఇండియాకు వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులకు కేంద్రం ఆదివారంనాడు తాజా గైడ్లైన్స్ విడుదల..
న్యూఢిల్లీ: ఇండియాకు వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆదివారంనాడు తాజా గైడ్లైన్స్ విడుదల చేసింది. ఇండియాకు వచ్చే ప్రయాణికులకు 7 రోజుల పెయిడ్ ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్ తప్పనిసరి అని ఆ మార్గదర్శకాలలో పేర్కొంది. అయితే, ఈ గైడ్లైన్స్ ఈనెల 8 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. దేశంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ గైడ్లైన్స్ ప్రకటించింది.
షెడ్యూల్డ్ డిపార్చర్కు 72 గంటలకు ముందే ప్రయాణుకులందరూ ఢిల్లీ విమానాశ్రయ పోర్టల్కు సెల్ఫ్ డిక్లరేషన్ సమర్పించాలని తాజా మార్గదర్శకాలలో కేంద్రం పేర్కొంది. సొంత ఖర్చుతో 7 రోజుల పెయిట్ ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్, మరో 7 రోజుల హౌస్ ఐసొలేషన్ (మొత్తం 14 రోజులు) క్వారంటైన్కు సమ్మతిస్తూ అండర్ టేకింగ్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్కు మినహాయింపు ఇవ్వాలని కోరుకునే వారు ఇదే విషయాన్ని పోర్టల్కు అప్లయ్ చేసుకోవాలని, అరైవల్కు సంబంధించి నెగిటివ్ ఆర్టీ-పీసీఆర్ టెస్ట్ రిపోర్టును సమర్పించాల్సి ఉంటుందని పేర్కొంది.
విమానం ఎక్కే ముందు టిక్కెట్ వెనుక రాసి ఉన్న నిబంధనలు చదువుకోవాలని కూడా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అందరూ ఆరోగ్య సేతు యాప్ను తమ ఫోన్లలో డౌన్లోడ్ చేసుకోవాలని, బోర్డింగ్కు ముందు ప్రయాణికులకు థర్మల్ స్క్రీనింగ్ జరిపి ఎలాంటి కోవిడ్ లక్షణాలు లేకుంటేనే అనుమతించడం జరుగుతుందని పేర్కొంది.