75 శాతం పంట రుణ లక్ష్యం పూర్తి
ABN , First Publish Date - 2021-12-08T06:01:23+05:30 IST
జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్, రబీ పంట రుణాల కింద రూ.5,601 కోట్లకుగాను ఇప్పటివరకు రూ.4,241 కోట్లు (75 శాతం) అందజేశామని కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లికార్జున తెలిపారు.
శీతల గిడ్డంగుల ఏర్పాటును ప్రోత్సహించాలి
కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లికార్జున
విశాఖపట్నం, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్, రబీ పంట రుణాల కింద రూ.5,601 కోట్లకుగాను ఇప్పటివరకు రూ.4,241 కోట్లు (75 శాతం) అందజేశామని కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లికార్జున తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లో డీసీసీ (డిస్ట్రిక్ట్ కన్సల్టేటివ్ కమిటీ), జిల్లాస్థాయి సమీక్షా కమిటీ త్రైమాసిక సమావేశాన్ని చైర్మన్ హోదాలో ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉద్యానవన పంటలకు రుణాలు పెంచాలన్నారు. వ్యవసాయో త్పత్తులు నిల్వ చేయడానికి అవసరమైన చోట్ల శీతల గిడ్డంగులు నిర్మించేలా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలన్నారు. కౌలు రైతులకు సాగుహక్కు కార్డులు త్వరితగతిన అందించాలని, రైతుభరోసా కేంద్రాల్లో బ్యాంకింగ్ కార్యకలాపాల కోసం కరస్పాండెంట్లను నియమించాలన్నారు. మత్స్య, పశుసంవర్థకశాఖ పరిధిలో రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులు ఇవ్వాలని ఆదేశిం చారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల ఏర్పాటు, విదేశీ విద్యకు సంబంధించి రుణాల మంజూరులో ఇబ్బందులు సృష్టించవద్దని బ్యాంకర్లకు సూచించారు. స్త్రీనిఽధి, జగన్నతోడు, స్వయంశక్తి సంఘాల సభ్యులకు రుణాల మంజూరుపై దృష్టిసారించాలన్నారు. జగనన్నతోడు కింద తొలి రెండు విడతల రుణాలు చెల్లించిన లబ్ధిదారులకు సున్నావడ్డీకే రూ.10 వేల వరకు రుణసౌకర్యం కల్పించాలన్నారు. పీఎంఏవై. టిడ్కో గృహ రుణాలకు సంబంధించి రూ.18,416 లక్షలకు గాను ఇంతవరకు రూ.1,605 లక్షలు మాత్రమే మంజూరు చేశారని, లక్ష్యసాధనకు చర్యలు తీసుకోవాలన్నారు. డీఆర్డీఏ పీడీ పి.విశ్వేశ్వరరావు మాట్లాడుతూ జగనన్నతోడు మూడోవిడతకు సంబంధించి జిల్లాలో 87,606 మంది లబ్ధిదారులకు రుణం ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించామన్నారు. అనంతరం నాబార్డు పొటెన్షియల్ క్రెడిట్ ప్లాన్బుక్ను కలెక్టర్ ఆవిష్కరించారు. సమావేశంలో జేసీ ఎం.వేణుగోపాలరెడ్డి, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజరు శ్రీనాథ్ ప్రసాద్, జీవీఎంసీ యూసీడీ పీడీ. వి.శ్రీనివాసరావు, డీసీసీబీ సీఈవో డీవీఎస్ వర్మ, నాబార్డు డెవలప్మెంట్ అధికారి శ్రీనివాసరావు, వ్యవసాయ, పశుసంవర్థక, మత్స్యశాఖ జేడీలు లీలావతి, రామకృష్ణ, లక్ష్మణరావు, బ్యాంకుల అధికారులు పాల్గొన్నారు.