8 రోజులు.. 356 కేసులు
ABN , First Publish Date - 2020-04-09T09:07:31+05:30 IST
హైదరాబాద్ పహాడీ షరీఫ్ ప్రాంతంలో వృద్ధురాలు మృతి చెందింది. అంత్యక్రియలకు సుమారు 40 మంది హాజరయ్యారు. ఆమెకు పరీక్షల్లో పాజిటివ్ తేలింది. దీంతో 40మందిని క్వారంటైన్ చేశారు. వారిలో 15 మందికి పాజిటివ్ అని తేలింది. వీరిలో 18 నెలల పాప, మూడేళ్ల బాబు ఉన్నట్లు తెలిసింది
- కొత్తగా 49 మందికి వైరస్
- రంగారెడ్డిలో అత్యధికంగా 17 మందికి
- ఆ తర్వాత హైదరాబాద్లో 11 కేసులు
- నిర్మల్లో కొత్తగా ఆరుగురికి వైరస్
- ఖమ్మంలో రిటైర్డ్ ఉద్యోగికి పాజిటివ్
- నల్లగొండ జిల్లాలో ఇద్దరికి పాజిటివ్
- మర్కజ్ పాజిటివ్లు 329 మంది
- కాంటాక్టులతో కలిపి 3510 మంది పైనే
- అందరికీ పరీక్ష చేయాలన్న ప్రభుత్వం
18 నెలల పాపకు.. 3 ఏళ్ల బాబుకు..
హైదరాబాద్ పహాడీ షరీఫ్ ప్రాంతంలో వృద్ధురాలు మృతి చెందింది. అంత్యక్రియలకు సుమారు 40 మంది హాజరయ్యారు. ఆమెకు పరీక్షల్లో పాజిటివ్ తేలింది. దీంతో 40మందిని క్వారంటైన్ చేశారు. వారిలో 15 మందికి పాజిటివ్ అని తేలింది. వీరిలో 18 నెలల పాప, మూడేళ్ల బాబు ఉన్నట్లు తెలిసింది. మర్కజ్కు వెళ్లి వచ్చిన వారిని కలిసిన ఆమె కొడుకు ద్వారా వృద్ధురాలికి కరోనా సోకింది. అంత్యక్రియలకు హాజరైన బంధువుల్లో కొందరికి, వారి నుంచి ఇద్దరు పిల్లలకు కరోనా వచ్చినట్లు చెబుతున్నారు.
(ఆంధ్రజ్యోతి న్యూస్నెట్వర్క్)
రాష్ట్రంలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. బుధవారం కొత్తగా 49 కేసులు నమోదయ్యాయి. దాంతో మొత్తం కేసుల సంఖ్య 453కు చేరుకుంది. ఒక్క ఏప్రిల్ నెలలోనే 356 కేసులు నమోదు కావడం గమనార్హం. గడచిన వారం రోజులూ రోజుకు సగటున 45 కేసులు నమోదవుతున్నాయి. అయితే, ఆందోళన చెందాల్సిన పని లేదని, మరో రెండు మూడు రోజులు ఇలాగే కొనసాగి, అనంతరం పూర్తిగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. బుధవారం రంగారెడ్డి(17), హైదరాబాద్(11) జిల్లాల్లో అత్యధిక కేసులు నమోదయ్యాయి. నిర్మల్లో 6, నిజామాబాద్లో 3, మేడ్చల్లో 3, ఖమ్మంలో 2, కామారెడ్డిలో 2, నల్గొండలో 1, వికారాబాద్లో 1, భూపాలపల్లిలో 1, పాలమూరులో 1, సూర్యాపేటలో 1 చొప్పున కేసులు కొత్తవి తేలాయి. యాక్టివ్ కేసుల సంఖ్య 397కు చేరగా, 45 మంది డిశ్చార్జ్ అయ్యారు. 11 మంది కరోనాతో చనిపోయారు. ఖమ్మంలో 65 ఏళ్ల విద్యుత్ శాఖ రిటైర్డు ఉద్యోగికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఎనిమిదేళ్లుగా క్యాన్సర్తో బాఽధ పడుతున్న ఆయనకు ఏప్రిల్ 1 నుంచే జ్వరం వస్తోంది. మొదట ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో చేర్చారు. తర్వాత హైదరాబాద్ కేర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి అనుమానంతో గాంధీకి తరలించారు. నెగటివ్ వచ్చింది. దాంతో తిరిగి కేర్కు వచ్చారు. ఆరో తేదీన మరోసారి కరోనా పరీక్ష చేయగా పాజిటివ్ వచ్చింది. ఖమ్మంలో ఆయన బంధువుల్లో ఎవరైనా విదేశాలకు, ఢిల్లీకి వెళ్లివచ్చారా? అని ఆరా తీస్తున్నారు. ఎర్రగడ్డలోని ఛాతీ ఆస్పత్రిలో 36 కరోనా కేసులకు చికిత్సను అందిస్తున్నారు. ఇందులో 28 కరోనా పాజిటివ్ కేసులు. అందులో మూడు కొత్తగా వచ్చాయి. మరో ఎనిమిది మంది అనుమానిత కేసులకూ చికిత్స చేస్తున్నారు. వికారాబాద్ మధు కాలనీలో నమోదైన పాజిటివ్ కేసు ద్వారా మరో యువకుడికి కరోనాసంక్రమించింది. వైద్య పరీక్షల కోసం పంపించిన పలువురి నమూనాలు రావాల్సి ఉంది. నిర్మల్ జిల్లాలో కొత్తగా ఆరుగురికి పాజిటివ్ వచ్చింది. ముగ్గురు గల్ఫ్ నుంచి వచ్చి క్వారంటైన్ ఉన్నవారు. మరో వ్యక్తి బీహార్ వలస కూలీ. ఇటీవలే ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతూ గుండెపోటుతో మరణించిన సలీం అనే వ్యక్తి తల్లి, కూతురు కూడా కరోనా పాజిటివ్ అని తేలినట్లు అధికారులు వెల్లడించారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో మరో ఇద్దరికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఢిల్లీ వెళ్లి వచ్చిన వారితో వీరిద్దరూ సన్నిహితంగా తిరిగినట్లు తేలింది. నల్లగొండ జిల్లాలో గతంలో కరోనా వచ్చిన మహిళ మనుమరాలికి బుధవారం పాజిటివ్ రిపోర్టు వచ్చింది. సదరు యువతి(17) నాయనమ్మ, తాతయ్య వద్ద ఉంటూ చదువుకుంటోంది. వారు మర్కజ్ వెళ్లేందుకు సదరు యువతిని తండ్రి వద్ద వదిలివెళ్లారు. మర్కజ్ యాత్ర ముగించుకుని కుమారుడి వద్దకు వచ్చి ఉండడాన్ని గుర్తించిన వైద్యాధికారులు పరీక్షలు చేయగా మహిళకు పాజిటివ్గా తేలింది. కుటుంబ సభ్యులకు పరీక్షలు చేయగా, తాజాగా మనుమరాలికి వచ్చింది. సూర్యాపేటలో కిరాణా దుకాణం యజమానికి కరోనా వచ్చింది. మత ప్రచారానికి వచ్చిన వియత్నాం, మయన్మార్ పర్యటకులు 39 మందిపై నల్లగొండ పోలీసులు కేసు నమోదు చేశారు. మార్చి 4న వియత్నాం దేశానికి చెందిన 12 మంది టూరిస్టు వీసాపై వచ్చారు. ఢిల్లీలోని తబ్లీక్ ఆర్గనైజర్లను కలిసి వారి ఆదేశాల మేరకు ఇద్దరు గైడ్లను వెంటపెట్టుకొని నల్లగొండకు వచ్చారు. మార్చి 9-19 తేదీల మధ్య నల్గొండలో మత ప్రచారం నిర్వహించారు. మయన్మార్కు చెందిన 27 మంది అలాగే దొరికిపోయారు.
తండ్రి నుంచి కూతురుకు కరోనా
భూపాలపల్లి జిల్లాకు చెందిన 20 ఏళ్ల యువతికి కరోనా పాజిటివ్ నిర్ధారణ జరిగింది. మర్కజ్కు వెళ్లొచ్చిన సింగరేణి కార్మికుడైన ఆమె తండ్రికి ఈనెల 3న పాజిటివ్ వచ్చింది. దీంతో భార్యను, కూతురును క్వారంటైన్లో ఉంచి పరీక్షలు జరపగా కూతురుకు పాజిటివ్ వచ్చింది. బుధవారం తెల్లవారుజామున ఆమెను కాళేశ్వరం హరిత హోటల్ క్వారంటైన్ నుంచి హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. కాగా, ఏపీలో బుధవారం ఒక్కరోజే 34 కేసులు నమోదయ్యాయి. మొత్తం ఎనిమిది జిల్లాల్లో కేసులు నమోదు కావడం వైరస్ వ్యాప్తి తీవ్రతకు నిదర్శనంగా భావిస్తున్నారు. ఏపీలో ఆస్పత్రుల్లో మొత్తం కోలుకుంటున్నవారి సంఖ్య 348కి చేరింది.
అమాత్యా భౌతిక దూరమేదీ ?
కరోనా కట్టడికి భౌతిక దూరం పాటించాలన్న నిబంధనను సాక్షాత్తు అమాత్యులే బేఖాతరు చేస్తున్నారు. బుధవారం పలు జిల్లాల్లో ఈ దృశ్యాలు కనిపించాయి. నిజామాబాద్ జిల్లాలో మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి చుట్టూ కేవలం ఒక మీటర్లోనే ఆరుగురు కనిపించారు. అదే జిల్లాలో మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి చుట్టూ 11 మంది కనిపించారు. హోంమంత్రి ఎండీ మహమూద్అలీ పేద వర్గాలకు సహాయం చేసే కార్యక్రమంలో ఒకేచోట పది మంది ఉన్నారు. ఖమ్మం జిల్లాలో మంత్రి పువ్వాడ అజయ్ పాల్గొన్న కార్యక్రమంలో ఒక మీటర్లోపు 10 మంది ఉన్నారు. ఇక మంత్రి వి.శ్రీనివాస్గౌడ్ పేదలకు నిత్యావసరాల పంపిణీలో ఒక మీటర్లోపు ఏడు మంది ఉన్నారు.
మర్కజ్ పాజిటివ్లు 329
రాష్ట్రంలో మర్కజ్ మసీదుతో సంబంధం ఉన్న వారిలో 329 మందికి పాజిటివ్ వచ్చినట్లు వైద్య ఆరోగ్య శాఖ తేల్చింది. ఢిల్లీలోని మర్కజ్ మసీదుకు వెళ్లి వచ్చినవారు 1089 మంది కాగా, వారితో కాంటాక్టులోకి వచ్చిన కుటుంబీకులు, సన్నిహితులు 2421 మంది ఉన్నట్లు గుర్తించారు. అంటే మొత్తం 3510 మంది అన్నమాట. వారిలో 2364 మందికి కరోనా పరీక్షలు చేశారు. బుధవారం వరకు 1425 మందికి నెగటివ్ వచ్చింది. 329 మందికి పాజిటివ్ వచ్చింది. మరో 603 మంది ఫలితాలు రావాల్సి ఉంది. 1146 నమూనాలను సేకరించాల్సి ఉంది.