ఆక్సిజన్‌ ప్లాంట్లు ఖాళీ ప్రాణం తీసిన వాయువు

ABN , First Publish Date - 2021-05-04T07:20:55+05:30 IST

ప్రాణవాయువు అందక ప్రాణాలు పోతూనే ఉన్నాయి. అనంతపురం జిల్లా హిందూపురం ఆస్పత్రిలో ‘ఆక్సిజన్‌’ అందక కొవిడ్‌ బాధితుల ప్రాణాలు కొట్టుమిట్టాడాయి.

ఆక్సిజన్‌ ప్లాంట్లు ఖాళీ ప్రాణం తీసిన వాయువు

  • హిందూపురంలో 8 మంది మృతి.. 
  • కొవిడ్‌ ఆస్పత్రిలో మృత్యుఘోష
  • ప్రాణవాయువు అందక విలవిల.. 
  • మరణించింది ముగ్గురే అని అధికారుల ప్రకటన

హిందూపురం టౌన్‌, మే 3: ప్రాణవాయువు అందక ప్రాణాలు పోతూనే ఉన్నాయి. అనంతపురం జిల్లా హిందూపురం ఆస్పత్రిలో ‘ఆక్సిజన్‌’ అందక కొవిడ్‌ బాధితుల ప్రాణాలు కొట్టుమిట్టాడాయి. బాధితుల కథనం ప్రకారం... ఆక్సిజన్‌ అందక ఎనిమిది మంది మరణించినట్లు తెలుస్తోంది. ఆక్సిజన్‌ అయిపోవడం నిజమేనని అధికారులు కూడా అంగీకరించారు. అయితే... ఈ కారణం వల్ల ముగ్గురు మాత్రమే మరణించారని, మిగిలిన వారు వ్యాధి తీవ్రతతో చనిపోయారని తెలిపారు. అనంతపురం జిల్లా హిందూపురం ప్రభుత్వాస్పత్రిలో 200 పడకలు ఉన్నాయి. అన్నీ కొవిడ్‌ బాధితులతో నిండిపోయాయి. ఇందులో సుమారు 50 మంది ఆక్సిజన్‌పై చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రి ఆవరణలో 6 టన్నుల సామర్థ్యమున్న ఆక్సిజన్‌ ప్లాంటు ఉంది. ఇక్కడి నుంచే ‘సెంట్రలైజ్డ్‌’ పద్ధతిలో ఐసీయూలోని పడకలకు ఆక్సిజన్‌ అందుతుంది. అయితే... సోమవారం తెల్లవారుజామున ఆస్పత్రిలోని ఆక్సిజన్‌ ప్లాంట్‌ ఖాళీ అయిపోయింది.దీంతో ఉదయం 6.30 గంటలకు ఆక్సిజన్‌ సరఫరా నిలిచిపోయినట్లు తెలుస్తోంది. సంబంధిత సిబ్బంది కూడా పట్టించుకోకపోవడంతో కొవిడ్‌ బాధితులు ఒక్కొక్కరుగా ప్రాణాలు విడిచారు.


ఈ విషయం బయటకు పొక్కకుండా ఆస్పత్రి వైద్యాధికారులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆక్సిజన్‌ అందకపోవడంతో ప్రాణాలు పోయినట్లు మృతుల బంధువులకు సమాచారం అందడంతో.. వారంతా ఆస్పత్రి వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. వైద్యులు, అధికారుల నిర్లక్ష్యంవల్లే తమవారు చనిపోయారంటూ ఆక్రోశం వ్యక్తం చేశారు. అదే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరికొందరు కరోనా బాధితుల కుటుంబ సభ్యులు, బంధువులు కూడా ఆందోళనతో అక్కడికి చేరుకున్నారు. తమ వారి ఆరోగ్య స్థితిపై అక్కడి డాక్టర్లతో ఆరా తీశారు. కొందరికి ఆక్సిజన్‌ అయిపోవడంతో... ఆసత్రిలో ఓ గదిలో ఉన్న సిలిండరును తీసుకొని వచ్చి బాధితుల బంధువులే బిగించారు. మృతుల కుటుంబీకులు, బంధువుల రాకతో ఆస్పత్రి ఆవరణలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొందరు ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లిపోయారు. పోలీసులు అక్కడికి చేరుకుని మృతుల బంధువులను ఓదారుస్తూనే... ఆందోళన విరమించేలా సర్దిచెప్పారు. 


బెంగళూరు నుంచి ఆక్సిజన్‌

‘ఆక్సిజన్‌’ విషాదంతో ఉన్నతాధికారులు అప్పటికప్పుడు అప్రమత్తమయ్యారు. చిన్న ఆక్సిజన్‌ సిలిండర్ల ద్వారా బాధితులకు ప్రాణవాయువు అందించారు. బెంగళూరు నుంచి ఆగమేఘాల ఆక్సిజన్‌ మీద తెప్పించి, ప్లాంటులోని సిలిండర్‌ను నింపారు. పెనుకొండ సబ్‌-కలెక్టర్‌ నిషాంతి, అటవీ అధికారి జగన్నాథ్‌సింగ్‌  హిందూపురం కొవిడ్‌ ఆస్పత్రిలో పరిస్థితి సమీక్షించారు.


చెప్పినా పట్టించుకోలేదు

ఆక్సిజన్‌ అందలేదని చెబుతున్నా.. వైద్యులు, నర్సులు పట్టించుకోలేదని మృతుల బంధువులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘వారం రోజులుగా మా వాళ్లకు ధైర్యం చెబుతూ.. రక్షించుకుంటూ వచ్చాం. గంటలోనే ఆక్సిజన్‌ ఇవ్వకుండా చంపేశారు’’ అంటూ విలపించారు. ప్రాణం పోయాల్సిందిపోయి.. ప్రాణవాయువు అందించక ప్రాణాలు తీస్తున్నారంటూ రోదించారు. ఆక్సిజన్‌ ప్లాంట్‌ ఖాళీ అవడంతో సోమవారం ఉదయం 5.30 నుంచి కొద్దిసేపు సరఫరా ఆగిపోయిందని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ దివాకర్‌ తెలిపారు.   ఆక్సిజన్‌ అందకపోవడంవల్ల ముబారక్‌, రమేశ్‌, నంజేగౌడ్‌ అనే ముగ్గురు బాధితులు చనిపోయాని, మిగిలిన ఐదుగురి మరణానికి ఆక్సిజన్‌ అందకపోవడం కారణం కాదని తెలిపారు.

Updated Date - 2021-05-04T07:20:55+05:30 IST